'మేం గర్వంగా ఫీలవుతున్నాం'

by  |
మేం గర్వంగా ఫీలవుతున్నాం
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు రావడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సుముఖత వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు క్రికెట్ సిరీస్‌లు వాయిదా పడిన క్రమంలో తిరిగి ఆటను ప్రారంభించడానికి ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆసక్తి కనబరుస్తోన్నది. దీనిలో భాగంగా జూలై నెలలో బయో సెక్యూర్ వేదికల్లో పాకిస్తాన్ జట్టును మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడటానికి ఆహ్వానించారు. కాగా, ఈ సిరీస్‌లో ఆడమని ఏ క్రికెటర్‌ను బలవంతం చేయబోమని.. వారు అంగీకరిస్తేనే జట్టులోకి తీసుకుంటామని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తెలిపారు. ఈ పర్యటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో వసీం ఖాన్ మాట్లాడుతూ.. ఈ పర్యటన గురించి ఈసీబీతో సుదీర్ఘ చర్చలు జరిపామని.. ఇంగ్లాండ్‌కు ఆటగాళ్లను పంపడానికి అంగీకారానికి వచ్చామని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూలైలో పాకిస్తాన్ టీమ్‌ను ఇంగ్లాండ్ పర్యటనకు పంపుతామని అన్నారు. కాగా, కరోనా ఉధృతి బ్రిటన్‌లో ఇంకా పూర్తిగా తగ్గనందున అన్ని వేదికల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆయా స్టేడియంల వద్ద బయో సెక్యూర్ ఏర్పాట్లను ఇంగ్లాండ్ చూసుకుంటుందని వసీం చెప్పారు. ప్రస్తుతానికి మాంచెస్టర్, సౌంతాప్టన్‌లను టెస్టు వేదికలుగా ఖరారు చేశారు. మూడో వేదికను కూడా త్వరలోనే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.

ఈ సిరీస్‌లో ఆటగాళ్ల భద్రతకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు వసీం స్పష్టం చేశారు. ప్రతీ రోజు ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడంతో పాటు అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నారు. జట్టుతో పాటు ఒక ప్రత్యేక వైద్య బృందం వెంటే ఉంటుందని వసీ ఖాన్ వెల్లడించారు. క్రికెట్ ఆట పూర్తిగా స్తంభించిపోయిన సమయంలో.. అంతర్జాతీయ మ్యాచ్‌లను తిరిగి ప్రారంభించడం చాలా ముఖ్యం. ఇందులో పాకిస్తాన్ జట్టు ముందుండటాన్ని తాము గర్వంగా భావిస్తున్నట్లు వసీం పేర్కొన్నారు.

Next Story

Most Viewed