ఈ ఆరేండ్ల దొర పాలనలో తెలంగాణ దగా పడింది: పద్మ

by  |
ఈ ఆరేండ్ల దొర పాలనలో తెలంగాణ దగా పడింది: పద్మ
X

దిశ, వరంగల్: తెలంగాణ రాష్ట్రము సాధించిన నాటి నుంచి నేటి వరకు గడిచిన ఆరేండ్ల దొర పాలనలో తెలంగాణ రాష్ట్రము దగా పడిందని, ఈ పాలన అంతం కావాలంటే దొరల గడీలను కూలగొట్టి గరీబోళ్ల రాజ్యం తేవాలని బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు.‌ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత ఇప్పుడు ఆరు సంవత్సరాల టీఆర్‌ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు దగా పడ్డారని, ధనిక రాష్ట్రాన్ని కాస్తా అప్పుల రాష్ట్రంగా చేశాడని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపే కమీషన్లకు కక్కుర్తి పడి పని చేస్తుందని విమర్శించారు. దేశంలో పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రధాని మోడీ అన్ని ప్రాంతాల కోసం పని చేస్తున్నారని, సీఎం కేసీఆర్ మాటల గారడీతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన హమీలు అమలు చేయక, ప్రభుత్వం పన్నుల నుంచి వచ్చిన ఆదాయాన్ని చూపెట్టి ప్రజల ఆదాయం పెరిగినట్టు మభ్యపెట్టడం సిగ్గుచేటన్నారు. అప్పులు చేయడంలో తెలంగాణ నంబర్ వన్‌లో ఉందని, ఆరు సంవత్సరాలలో ప్రజల స్థితిగతులు ఏమీమారలేదని కేవలం కేసీఆర్ కుటుంబ స్థితిగతులు మారాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కొలను సంతోష్ రెడ్డి, పాశికంటి రాజేంద్ర ప్రసాద్, మంథాటి వినోద్, బాకం హరిశంకర్, జన్ను మధు, కనుకుంట్ల రంజిత్, రాజశేఖర్ రెడ్డి, సిద్ధం నరేష్, రాంకీ యాదవ్, నాను నాయక్, గణేష్, అమర్నాథ్ రెడ్డి, జగన్ రెడ్డి,భవాని శంకర్, రాజు, కల్లూరి పవన్, అపరూప సాయి, కనకయ్య యాదవ్, ఆరోగ్యం, కొంక భాస్కర్, చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story