కార్మికులకు సింగరేణి శుభవార్త

by  |
కార్మికులకు సింగరేణి శుభవార్త
X

దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి ఏరియాల్లో కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ యాజమాన్యం పలు చర్యలను చేపట్టింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు‌లో సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాంలు ఈ చర్యలను అన్ని ఏరియాల జనరల్ మేనేజర్‌లకు వివరించారు. కరోనా వ్యాధి సోకిన కార్మికులకు తక్షణం వైద్య సహాయం అందించడానికిగాను సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న మూడు కాకుండా మరో మూడు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో కరోనా అత్యవసర సేవల కోసం సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని, సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో సీరియస్ అయిన కేసులను ఈ ఆసుపత్రులకు యాజమాన్యం తరలిస్తుందని వారు పేర్కొన్నారు.

కరోనా అత్యవసర కేసులకు ఇక ఆస్పత్రుల కొరత అనేదే ఉండదని, అంతే కాకుండా హెటిరో కంపెనీ తయారుచేసిన అత్యంత ఖరీదైన 1800 డోసుల ఇంజెక్షన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీటిని గురువారం నాటికి అన్ని సింగరేణి ఏరియా ఆస్పత్రులకు సమకూర్చుతామన్నారు. కాగా సింగరేణి ఏరియా ఆసుపత్రులతో పాటు క్వారంటైన్ సెంటర్లలో పని చేస్తున్న వైద్య సిబ్బంది‌కి సహాయపడడానికి అవసరమైన వారిని తక్షణమే నియమించుకోవాలని ఏరియా ఆస్పత్రుల ఇంచార్జులను డైరెక్టర్లు కోరారు . కరోనా సేవల్లో ఉన్న వైద్య సిబ్బందికి నెల జీతం‌ కాకుండా 10 శాతం అదనంగా కరోనా అలవెన్స్ చెల్లిస్తున్నామని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రోజు వారి జీతం‌పై మూడు వందల రూపాయలు అదనంగా చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జీఎం కోఆర్డినేషన్ రవిశంకర్ , చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్, రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed