శాస్త్రవేత్తల షాక్.. సూర్యాపేట జిల్లాలో భారీగా పెరిగిన భూమి

by  |
శాస్త్రవేత్తల షాక్.. సూర్యాపేట జిల్లాలో భారీగా పెరిగిన భూమి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామం. మఠంపల్లి మండలంలోనే అది అతిపెద్ద సర్వే నంబర్. ఆ నెంబరే 540. ఈ సర్వే నెంబర్లు అక్షరాల 6500 ఎకరాల భూమి ఉంది. కానీ ఆ భూమి గత కొద్ది సంవత్సరాలుగా పెరుగుతూ వస్తోంది. అదేంటి ఈ భూమి పెరగడం ఏంటి అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. అక్కడ భూమి పెరుగుతోంది.. కాకపోతే అది కేవలం రికార్డుల్లో మాత్రమే. ఆ సర్వే నెంబర్లో భూమి పెరిగింది.. అది కూడా ఒకట్రెండు ఎకరాలు కాదు ఏకంగా 12 వేల ఎకరాలకు భూమి పెరగడం గమనార్హం. కొంతమంది స్థానిక నేతల స్వార్థం.. అధికారుల అక్రమార్జన కారణంగా 6500 ఎకరాలు ఉన్న భూమి.. 12 వేల ఎకరాలకు పెరిగింది. ఎవరైనా చెట్లను, జంతువులను పెంచుకుంటారు. కానీ ఇక్కడి స్వార్థపూరిత నేతలు భూములని పెంచడం.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇదంతా భూముల వ్యవహారాలను తహసీల్దార్లు.. ఇందులో ముఖ్య పాత్రధారులు ఉండడం సంచలనంగా మారింది.

మొదటి నుంచి వివాదాస్పదమే..

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని పెదవిడు గ్రామంలోని సర్వేనెంబర్ 540 మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటూ వస్తోంది. వాస్తవానికి ఆ సర్వే నెంబర్లో 6500 ఎకరాల భూమి ఉంది. స్థానికంగా ఉండే గిరిజనులు, పేదలు ఆ సర్వే నంబర్లోని భూములను సాగు చేసుకుంటున్నారు. ఆ భూములకు సంబంధించిన కబ్జాలో అధిక శాతం గిరిజనులు ఉన్నారు. అయితే వారిలో మాత్రం పట్టాలు చాలా తక్కువ మందికి ఉన్నాయి. మిగిలిన పట్టాలు బడాబాబులు, స్థానిక నేతల చేతుల్లోనే ఉన్నాయి. నిజానికి 6500 ఎకరాలకు ఉండాల్సిన పట్టాలు.. ప్రస్తుతం 12 వేల ఎకరాలకు పైగా ఉండడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలువేసుకునే పరిస్థితి.

ఇద్దరు తహసీల్దార్ల సస్పెండ్..

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 540 లో ప్రభుత్వ భూములను ఇతరులకు పట్టాలు చేసిన ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ప్రస్తుతం మఠంపల్లి తహసీల్దార్ వేణుగోపాల్, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం గరిడేపల్లి తహసీల్దార్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఉన్నారు.

ప్రైవేటు కంపెనీకి 369 ఎకరాల భూమి ధారాదత్తం..

ఈ సర్వే నెంబర్‌లో సుమారు6 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అయితే భూమికి మించి ఎక్కువ విస్తీర్ణం పట్టాలు జారీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇటీవల విచారణ చేయడంతో పాటు సర్వే చేపట్టారు. ఈ క్రమంలోనే 420 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ముటేషన్ చేసినట్లుగా గుర్తించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మార్వో వేణుగోపాల్ 52 ఎకరాలు స్థానికులకు అక్రమంగా పట్టాలు ఇచ్చి ముటేషన్ చేసినట్లు తేలడంతో ఆయనపై వేటు పడింది. చంద్రశేఖర్ ఎమ్మార్వో 369 ఎకరాల భూమిని గ్లెడ్ ఆగ్రో బయోటెక్ సంస్థకు అక్రమంగా పాసు పుస్తకాలు జారీ చేసి, ముటేషన్లు చేశారన్న ఆరోపణపై సస్పెండ్ చేశారు. 540 సర్వేనెంబర్‌లో 6వేల ఎకరాల భూమికి గాను 12 వేల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు గా రెవెన్యూ యంత్రాంగం పై ఆరోపణలు ఉన్నాయి. రెండు వారాలుగా ఈ భూమిపై సర్వే విచారణ కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ భూమిని పరిశీలించారు. భూమిపై లేనివారికి సైతం మ్యుటేషన్లు, పట్టాలు ఇచ్చినట్టు తేలడంతో బాధ్యులపై కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. ఆరు వేల ఎకరాల భూ కుంభకోణంలో మరి కొంతమంది రెవెన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రెవెన్యూ అధికారులు గత పది సంవత్సరాలుగా పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

రైతుబంధు నగదు అసలు కారణమా..

12 వేల ఎకరాల భూ భాగోతం వెనుక రైతుబంధు నగదు ప్రధాన కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైతుబంధు నగదును అక్రమ మార్గంలో పొందేందుకు తహసీల్దార్లకు ముడుపులు ముట్టజెప్పి కోట్ల రూపాయలు భూములను స్థానిక నేతలు తమ పేర్ల మీద పట్టా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఇటీవల కాలంలో ఐదుగురు వ్యక్తుల పేరుమీద 52 ఎకరాలను తహసీల్దార్ సహకారంతో పట్టా చేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రైవేటు కంపెనీ అయిన గ్లెడ్ ఆగ్రో బయోటెక్ సంస్థకు ఏకకాలంలో 369 ఎకరాలను ధారాదత్తం చేసి పట్టాలు ఇవ్వడం పైన స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. స్వయంగా కలెక్టర్ సంబంధిత భూమి వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం మఠంపల్లి మండలంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏదిఏమైనా పేదలకు వాస్తవంగా ఉన్న భూమిని పట్టా చేయమంటే రెవెన్యూ అధికారులు నానా తిప్పలు పెడుతుంటారు. అలాంటిది అసలు భూమి లేకుండా వేల ఎకరాలకు పట్టాలు ఇవ్వడం రెవెన్యూ శాఖ పనితీరును తెలుపుతోంది.

Next Story

Most Viewed