75లక్షల మంది వలస కూలీలు సొంతూళ్లకు చేరారు: కేంద్రం

by  |
75లక్షల మంది వలస కూలీలు సొంతూళ్లకు చేరారు: కేంద్రం
X

న్యూఢిల్లీ : మనదేశంలో సుమారు నాలుగు కోట్ల మంది వలస కూలీలున్నారని, అందులో 75లక్షల మంది తిరిగి తమ సొంతూళ్లకు చేరారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సలీలా శ్రీవాస్తవ ఇక్కడ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మన జనాభా లెక్కల ప్రకారం సుమారు నాలుగు కోట్ల మంది కూలీలు ఉపాధి నిమిత్తం స్వగ్రామాలు వదిలి వేరే రాష్ట్రాలకు తరలారని తెలిపారు. మే 1వ తేదీ తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన సుమారు 2,600 శ్రామిక్ ట్రైన్‌ల ద్వారా సుమారు 35 లక్షల మంది వలస కూలీలు సొంతూళ్లకు చేరగా, 40 లక్షల మంది బస్సుల్లో తిరుగుప్రయాణమయ్యారని వెల్లడించారు.

రద్దీతో పాట్లు.. డైవర్షన్‌తో బెంబేలు

మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల నుంచి యూపీ, బీహార్ వెళ్లుతున్న శ్రామిక్ ట్రైన్‌లు రద్దీ కారణంగా 24 నుంచి 36 గంటలు ఆలస్యంగా నడిచాయి. బీహార్, యూపీకి గురువారం బయల్దేరిన ట్రైన్‌లు దాదాపు ఒక రోజు వ్యవధిలో గమ్యానికి చేరాలి. కానీ, ఇంకా చేరకపోవడంతో వలస కూలీలు పాట్లుపడుతున్నారు. ఒకే రూట్‌లో ఎక్కువ ట్రైన్‌లు నడవడం, రద్దీ రూట్‌లు కావడంతో ఈ సమస్య తలెత్తిందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. అలాగే, రద్దీ రూట్‌ల కన్నా దూరమైనా సరే.. సాఫీగా ప్రయాణించే అవకాశముంటుందని కొన్ని ట్రైన్‌లను రద్దీ తక్కువగా ఉన్న రూట్‌లకు రైల్వేస్ డైవర్ట్ చేసింది. కానీ, అందులో వెళ్లుతున్న కూలీలకు ఈ విషయం తెలియకపోవడంతో హడలిపోయారు. రాంగ్ రూట్‌లో వెళ్లుతున్నామనో, ప్రమాదం జరగచ్చనో బెంబేలెత్తిపోయారని తెలిసింది.


Next Story

Most Viewed