ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ పరిధిలోకి తీసుకోవాలి

by  |
Bopparaju Venkateshwarlu
X

దిశ, ఏపీ బ్యూరో : పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్‌కు సమర్పించిన అధికారుల కమిటీ నివేదికపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసే పీఆర్సీలో ఇప్పటికే ఐఆర్ 27 శాతం అమలు చేస్తుండగా… 14 శాతం ఫిట్మెంట్ సరిపోతుందని అధికారులు నివేదిక ఇవ్వడంపై మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఆర్సీ నివేదికపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తీసుకువచ్చి వారికి కూడా అన్ని వసతులు కల్పించాలన్నారు. ఏజెన్సీల ద్వారా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని చెప్పుకొచ్చారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్ల పరిష్కారంపై లిఖితపూర్వక హామీ ఇచ్చారని, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేందుకే ఉద్యమం తాత్కాలిక వాయిదా వేశామని బొప్పరాజు క్లారిటీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.



Next Story