ఉస్మానియా కూల్చివేతకు గ్రౌండ్ వర్క్?

by  |
ఉస్మానియా కూల్చివేతకు గ్రౌండ్ వర్క్?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ :
చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం కూల్చివేత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుమారు ఆరేళ్లుగా పాత భవనాన్ని కూల్చాలని కొంత మంది, చారిత్రత్మక భవనాన్ని కూల్చరాదని, దానిని అలాగే ఉంచి నూతన భవనాల నిర్మాణాలు చేపట్టాలని మరి కొంత మంది డిమాండ్ చేస్తూ వచ్చారు. మరికొందరు ఏకంగా న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ఇలా అందరి వాదనలు వింటూనే రాష్ట్ర సర్కార్ పాత భవనంలో కొంత మంది రోగులను ఇతర భవనాలోకి తరలించి చికిత్సలు అందిస్తూ నూతన భవనం విషయాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుతూ వచ్చింది. వీటన్నింటికి ఇటీవల వర్షాలు చెక్ పెట్టాయి. గతవారంలో కురిసిన భారీ వర్షాలు ఉస్మానియా పాత భవనంలోకి మోకాలి లోతు నీళ్లు రావడంతో నూతన భవనాల నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం ఉస్మానియా విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.

పాత భవనం తక్షణమే ఖాళీ చేయాలి..

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. భవనం ఖాళీ చేసి సీల్ వేసి సంబంధిత సమాచారాన్ని తమకు వెంటనే అందచేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలని, పాత భవనంలోని రోగులను ఇతర భవనాలలోని వార్డులలోకి తరలించాలని, పాత భవనంలో ఎలాంటి విధులు నిర్వహించరాదని, ఆదేశాలు అమలు చేయని పక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

600 పడకలు తరలింపు…

ఉస్మానియా ఆస్పత్రికి 1168 పడకల సామర్ధ్యం ఉండగా ఒక్క పాత భవనంలోని గ్రౌండ్, మొదటి, రెండో అంతస్థులలోనే 600కు పైగా ఉన్న పడకలతో రోగులకు సేవలందిస్తున్నారు. ఈ భవనంలో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో, అనస్థీషియా, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీలు ఉన్నాయి. మూడు ఆపరేషన్ థియేటర్లతో రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తూ వచ్చారు. కాగా ఉస్మానియా పాత భవనాన్ని ఖాళీ చేయాలనే డిమాండ్ గత పదేళ్లుగా వినపడుతున్నప్పటికీ 2015 నుండి ఇది అధిక మైంది. దీంతో 2015 జూలై 23వ తేదీన సీఎం కేసీఆర్ హాస్పిటల్ ను సందర్శించి వారంలో ఖాళీ చేసి నూతన భవనం నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇందుకు తగ్గట్లుగాగానే మొదటి, రెండో అంతస్థులలోని రోగుల తరలింపును చేపట్టారు. ఆర్ధో రోగులను కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఇతర రోగులను పేట్లబుర్జు హాస్పిటల్‌కు షిప్ట్ చేశారు. అనంతరం వైద్య సేవల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా దవాఖానాలోని ఇతర భవనాలలోకి తరలించి సేవలందిస్తున్నారు. దీంతో గత రెండేళ్లుగా ఉస్మానియా మొదటి, రెండో అంతస్థులు ఖాళీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా పాత భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇటీవల వరద ముంచెత్తే సమయానికి 65 మంది రోగులు చికిత్సలుపొందుతున్నారు. మరుసటి రోజు వీరిని కూడా కులీ కుతుబ్ షా భవనంలోని షెల్టర్ రూమ్‌లలోకి తరలించారు. ఇందులో 200 పడకల సామర్ధ్యం ఉండగా 150 పడకల వరకు ఖాళీగా ఉండడంతో పాత భవనం రోగులను ఇక్కడికి తరలించారు. అంతకు ముందు కొంత మందిని హౌజ్ సర్జన్ క్వార్టర్స్‌లతో పాటు ఓపీ భవనంలోని ఆర్ఐసీయూ, ఐఎన్సీ వార్డులలోకి మార్చారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం పాత భవనంలోనే ఉంది. దీనిని ఎక్కడికి మార్చాలనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

శస్త్ర చికిత్సలకు ఇబ్బందులు!

ఉస్మానియా ఆస్పత్రి ఓపీ భవనంలో ప్రస్తుతం రెండు ఆపరేషన్ థియేటర్లలో ఆరు టేబుళ్లపై శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. పాత భవనంలో మూడు థియేటర్లు ఉన్నప్పటికీ వాటిల్లో శస్త్ర చికిత్సలు చేయలేని పరిస్థితి ఏర్పడనుంది. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్సందించి ఆపరేషన్ థియేటర్ లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే శస్త్ర చికిత్సలు వాయిదా పడే ప్రమాదముంది.

Next Story

Most Viewed