రాంగ్ క్లిక్‌తో.. చేజారిన ఐఐటీ సీటు

by  |
రాంగ్ క్లిక్‌తో.. చేజారిన ఐఐటీ సీటు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత టెక్ ఎరాలో ‘క్లిక్’ చేస్తే చాలు.. అన్ని పనులు జరిగిపోతాయి. కానీ ఒక్కోసారి ఆ చిన్న క్లిక్ కూడా జీవితాన్ని తలకిందులు చేయొచ్చు. ఈ క్రమంలోనే ఎంతో కష్టపడి చదివి ఐఐటీ సీట్ సంపాదించుకున్న ఓ విద్యార్థి.. ఒక్క రాంగ్ క్లిక్‌తో సీటు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తన సీటు తనకు కేటాయించాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాడు.

ఆగ్రాకు చెందిన 18 ఏళ్ల సిద్ధాంత్ బాత్రా.. జేఈఈ ఎంట్రన్స్‌లో ఆలిండియా 270వ ర్యాంకు తెచ్చుకున్నాడు. అమ్మనాన్నలు లేకపోయినా, తాత దగ్గరే ఉంటూ కెరీర్ మీద ఫోకస్ చేసిన సిద్ధాంత్.. కష్టపడి చదివి ఐఐటీ బాంబేలో పొందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సీటును తొందరపాటు కారణంగా కోల్పోయాడు. ఆన్‌లైన్‌లో అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేస్తుండగా, అతడికి ‘ఫ్రీజ్’ అనే ఆప్షన్ కనిపించింది. అది సీటు కన్‌ఫర్మ్ చేసుకోవడానికేనని భావించిన సిద్ధాంత్.. దానిపై క్లిక్ చేసి, ఆ తర్వాత ఫామ్ ఫిల్ అయ్యిందని అనుకున్నాడు. కానీ ఇటీవల బాంబే ఐఐటీ పోర్టల్‌లో అడ్మిషన్ పొందిన వారి జాబితాలో తన పేరు లేకపోవడంతో సిద్ధాంత్ ఐఐటీ అధికారులను సంప్రదించాడు. సీట్ క్యాన్సిల్ చేసుకోవడంతోనే తనకు అవకాశం దక్కలేదని, ఆ సీట్ వేరే వాళ్లకు కేటాయించామని వాళ్లు చెప్పారు. అయితే తనకు సీట్ విత్‌డ్రా చేసుకునే ఉద్దేశం లేదని, తనకు సీటు కేటాయించాలని ఐఐటీ అధికారులను కోరాడు. కానీ ఒక్కసారి సీట్ క్యాన్సిల్ చేస్తే, వెంటనే అది వేరే వాళ్లకు అలాట్ అవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తామేం చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో సిద్ధాంత్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే తమ చేతిలో ఏమీ లేదని, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీని సంప్రదించాలని కోర్టు తెలిపింది. సిద్ధాంత్ అక్కడి అధికారులను సంప్రదించగా.. సీట్ కావాలంటే వచ్చే ఏడాది మళ్లీ జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్ష రాసుకోవాలంటూ సూచించారు. అక్కడ కూడా అతడికి చుక్కెదురు కావడంతో.. సిద్ధాంత్ బాత్రా ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మంగళవారం కేసు విచారణ జరగనుంది. మరి సిద్ధాంత్‌కు సీట్ వస్తుందో రాదో వేచి చూడాలి.



Next Story

Most Viewed