అవయవ దానం.. నిలిపిన ఐదుగురి ప్రాణం

by  |
harish-reddy
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన సింగరేణి కార్మికుడు ఐదుగురి ప్రాణాలను నిలబెట్టాడు. తన అవయవాలను దానం చేయడంతో చనిపోయి మరీ ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాడని పలువురు భావిస్తున్నారు. వివరాల్లోకివెళితే.. కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన హరీష్ రెడ్డి(31) ధన్వాడ శివారులో వారం రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

మృతుడు సింగరేణి కార్మికుడు. ద్విచక్రవాహనంపై భూపాలపల్లి వెళ్తుండగా ఈ నెల 8న అదుపు తప్పి కింద పడటంతో తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లిపోయాడు.చికిత్స నిమిత్తం హరీష్‌ను బంధువులు హైదరాబాదు కామినేని హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించి హరీష్ బుధవారం మరణించడంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. హరీష్ బ్రెయిన్ డెడ్ అయ్యేకంటే ముందే డాక్టర్లు అతని తల్లికి, బంధువులకు తెలియజేయడంతో అవయవ దానానికి వారు ఒప్పుకున్నారు. దీంతో కామినేని హాస్పిటల్‌లో సర్జరీ చేసి అపోలో హాస్పటల్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొక రోగికి హరీష్ గుండెను అమర్చారు. ఊపిరితిత్తులను కిమ్స్ దవాఖానకు, కళ్లను ఐ బ్యాంకుకు, కిడ్నీలు, కాలేయం కామినేని హాస్పిటల్‌లో ఉన్న రోగులకు అమర్చారు. మృతుడి తల్లి వెంకటమ్మ, బావలు చంద్రశేఖర్, నగేష్, సోదరుడు వెన్నపురెడ్డి లక్ష్మణ్ అనుమతితో హరీష్ రెడ్డి అవయవాలను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరో ఐదుగురికి దానం చేయడంతో పలువురు అభినందించారు.


Next Story

Most Viewed