సర్కారుకు మరోసారి ఆదేశం : హైకోర్టు

by  |
సర్కారుకు మరోసారి ఆదేశం : హైకోర్టు
X

దిశ, న్యూస్ బ్యూరో: సచివాలయ భవనాల కూల్చివేత పనులను మరోరోజు ఆపేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భవనాల నిర్మాణంతో పాటు కూల్చివేతకు కూడా కేంద్ర పర్యావరణ చట్టం నిబంధనల మేరకు రెగ్యులేటరీ విభాగం నుంచి అనుమతి తీసుకోవాలని పిటిషనర్ లేవనెత్తిన వాదనతో రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్ ఏకీభవించలేదు. కొత్త నిర్మాణాలకు మాత్రమే అలాంటి అనుమతి అవసరం ఉంటుంది తప్ప కూల్చివేత పనులకు అవసరం లేదని కోర్టుకు వివరించారు. కూల్చివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు స్థానిక పరిపాలనా విభాగం నుంచి అనుమతి తీసుకున్నట్లు వివరించిన ఏజీ. కేంద్ర చట్టంలోని రెగ్యలేటరీ విభాగం అనుమతి విషయమై వివరణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ విచారణకు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసి తదుపరి విచారణను జూలై 16వ తేదీకి వాయిదా వేసింది.

సచివాలయ భవనాల కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అన్ని అనుమతులూ తీసుకున్న తర్వాతనే కూల్చివేత పనులను మొదలుపెట్టినట్లు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ నివేదిక సమర్పించారు. ఈ నివేదికను అధ్యయనం చేసిన పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కౌంటర్ రిప్లై దాఖలు చేశారు. కేంద్ర పర్యావరణ సవరణ చట్టం (2018)కి విరుద్ధంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయని వాదించారు. కేంద్ర పర్యావరణ రెగ్యులేటరీ చట్టానికి సంబంధించి గతంలో న్యాయస్థానాలు వెలువరించిన పలు తీర్పులను కోర్టుకు సమర్పిస్తామని, గడువు ఇవ్వాలని డివిజన్ బెంచ్‌ను కోరారు.

అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ, ఈ చట్టం ప్రకారం కొత్త నిర్మాణాలకు మాత్రమే అలాంటి అనుమతి అవసరమవుతుందిగానీ కూల్చివేతకు అవసరం లేదని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అలాంటి అనుమతులు అవసరమవుతాయి కాబట్టి నూతన సచివాలయాన్ని నిర్మించే సమయంలో ఆ అనుమతులను తీసుకుంటామని పేర్కొన్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న డివిజన్ బెంచ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం భవనాలను కూల్చివేయాలంటే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని సూచించింది. అలాంటి అనుమతిని ప్రభుత్వం తీసుకుందా అని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెపుతుందో తెలియజేయడానికి ఒక రోజు గడువు ఇవ్వాలని కోరిన అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తికి హైకోర్టు సానుకూలంగా స్పందించింది.



Next Story

Most Viewed