ఉద్యోగుల విభజన.. నేటి నుంచే ఆప్షన్లు..?

by  |
ఉద్యోగుల విభజన.. నేటి నుంచే ఆప్షన్లు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లాల వారీగా కేడర్​ స్ట్రెంత్​ కేటాయింపులకు అడుగులు పడుతున్నాయి. నెలల తరబడి కొనసాగుతున్న ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ముందుగా కొత్త జిల్లాలు, పునర్విభజన ప్రకారం కేడర్​ స్ట్రెంత్​ తేల్చనున్నారు. దీనిలో భాగంగా కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల విభజన చేయనున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. ఈ కేడర్​ స్ట్రెంత్​ పూర్తి అయిన తర్వాతే అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తేలనున్నాయి.

కేడర్​ స్ట్రెంత్​ తర్వాతే ఆఫ్షన్లు

కొత్త జిల్లాలకు ఆర్డర్​ టూ సర్వ్​ కింద ఉద్యోగులను విభజించిన విషయం తెలిసిందే. అయితే వీటిని రద్దు చేయకుండానే ఉద్యోగుల స్థానికతను తేల్చే ప్రక్రియలో వారి నుంచి ఆప్షన్లు తీసుకుంటామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. కానీ దీనిపై ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. ముందుగా కేడర్​ స్ట్రెంత్​ తేల్చాలని డిమాండ్​ పెట్టాయి. దీనిపై పలుమార్లు సీఎస్​, ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఈ విషయం ఎటూ తేలకపోవడంతో ఉద్యోగుల బదిలీలు కూడా పెండింగ్​ పడ్డాయి. ఒకదశలో దీన్ని సీఎం దగ్గర తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాల జేఏసీ తరుపున వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆప్షన్ల ప్రక్రియను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా కేడర్​ స్ట్రెంత్​ ఖరారు చేసి ఆప్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో జారీ చేశారు.

ఉమ్మడి జిల్లా కలెక్టర్​ నేతృత్వంలో..

ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ప్రకటించారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా శాఖల జిల్లా అధిపతులను సభ్యులుగా నియమించింది. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, ఆర్థికశాఖ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇతర సీనియర్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకొని సీనియారిటీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు.

ఇక ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉంటుందని జీవోలో వెల్లడించారు. ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతానికిపైగా సమస్య ఉన్న దివ్యాంగులకు, పిల్లల్లో మానసిక దివ్యాంగులు ఉన్న ఉద్యోగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో కోడ్ అనంతరం ప్రక్రియ చేపట్టనున్నారు. విభజన, కేటాయింపులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాలు రెండు చొప్పున పాత జిల్లాల నుంచి ఏర్పడ్డాయి. జోనల్, మల్టీజోనల్‌కు సంబంధించి కూడా ఈ తరహా అంశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేటగిరీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ విధివిధానాలను ప్రకటించింది. ఉమ్మడి జిల్లా పరిధిని సూచిస్తూ కొత్త జిల్లాల వారీగా ఎక్కడెక్కడ అర్హులనే వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు.

ముందుగా జిల్లా కేడర్​

ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్​ 317 ప్రకారం తొలుత విభజన ప్రక్రియను జిల్లా కేడర్​కు మాత్రమే పరిమితం చేశారు. జిల్లా కేడర్​లో ఆప్షన్లు, విభజన పూర్తి చేసిన తర్వాత జోనల్​, మల్టీజోనల్​ పోస్టుల ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. అయితే జిల్లా కేడర్​కు వేసిన కమిటీలు కూడా జోనల్​, మల్టీజోనల్​ స్థాయిలో ఉండనున్నాయి. జోనల్​, మల్టీజోనల్​ స్థాయిల్లో మాత్రం రాష్ట్రస్థాయి అధికారులు ఇంచార్జీలుగా వ్యవహరించనున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన ఉద్యోగులు ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​ జిల్లాల్లో ఆప్షన్లు తీసుకోవచ్చు. అదే విధంగా హైదరాబాద్​ జిల్లాకు చెందిన వారు అదే జిల్లాలో ఇవ్వాల్సి ఉంటోంది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన వారు హన్మకొండ (కొంత భాగం), జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి (కొంతపార్ట్​), కరీంనగర్​, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట (కొంతపార్ట్​)లో ఛాన్స్​ ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు చెందిన ఉద్యోగులు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్​ (కొంత పార్ట్​), ములుగు ( కొంత పార్ట్​)లో అవకాశం ఉంటోంది. మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాకు చెందిన వారు జోగుళాంబ గద్వాల, మహబూబ్​నగర్​ (కొంత భాగం), నాగర్​ కర్నూల్​, నారాయణపేట, రంగారెడ్డి (కొంత భాగం), వికారాబాద్​ (కొంతభాగం), వనపర్తి జిల్లాల్లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. మెదక్​ ఉమ్మడి జిల్లా పరిధిలో మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట (కొంత పార్ట్​) ఉండగా.. నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధిలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. నిజామాబాద్​ ఉమ్మడి జిల్లా పరిధి కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలకు ఛాన్స్​ ఉంటోంది. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఉద్యోగులు మహబూబ్​నగర్​ (కొంత పార్ట్​), మేడ్చల్​ మల్కాజిగిరి, రంగారెడ్డి (కొంత పార్ట్​), వికారాబాద్​ (కొంత పార్ట్​) జిల్లాలున్నాయి. ఇక వరంగల్​ ఉమ్మడి జిల్లా పరిధికి చెందిన వారు హన్మకొండ (కొంతపార్ట్​), జనగామ, జయశంకర్​ భూపాలపల్లి (కొంత పార్ట్​), మహబూబాబాద్​ (కొంత పార్ట్​,), ములుగు, సిద్దిపేట జిల్లాల్లో కొంత పార్ట్​, వరంగల్​ జిల్లాలకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం ఉన్నట్లు జీవోల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాల్లో కేడర్​ స్ట్రెంత్​ తేల్చనుండగా.. ఈ ఉమ్మడి జిల్లాలు, కొత్త జిల్లాల పరిధి కొంత పార్ట్​లు మాత్రం జోనల్​ విధానంలోనే ఉండనున్నాయి.

రెండు రోజుల్లో జాబితా ఇవ్వండి

కేడర్​ స్ట్రేంత్​, విభజన అంశాలపై సోమవారం రాత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పాత జిల్లాల వారీగా ఉన్న లోకల్​ కేడర్​ సీనియార్టీ జాబితాను అన్ని కేటగిరిల్లోని పోస్టులను కొత్తగా 2018 రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరిస్తూ జాబితా ఇవ్వాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎస్​ ఆదేశాలిచ్చారు. దీనికోసం నమూనా ప్రతిని సైతం ఇచ్చారు. పాత జాబితా ఇప్పటికే ఉన్నందున కొత్తగా మార్పులు చేసి ఇవ్వాలని, ఈ నెల 8 వరకు మొత్తం జాబితా ఇవ్వాలని సూచించారు.

సీఎస్​ సమీక్ష

రాష్ట్రంలోని ఉద్యోగుల విభజనపై సీఎస్ సోమేష్‌ కుమార్ సోమవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయగా.. ఈ కమిటీల నివేదికల ఆధారంగా ఉద్యోగుల విభజన పూర్తి చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై సీఎస్​ సమీక్షించారు.

నేటి నుంచే ఆప్షన్లు తీసుకోవాలని చెప్పాం : మామిళ్ల రాజేందర్​, టీఎన్జీఓ అధ్యక్షుడు

ఉద్యోగుల బదిలీలు, విభజన తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై అవసరమైతే త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తామని టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్‌ తెలిపారు. ఉద్యోగుల విభజన రాష్ట్ర స్థాయి కమిటీ ఛైర్మన్ వికాస్ రాజ్‌ను సోమవారం కలిసి ఈ విషయంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి ఆప్షన్స్‌ను తీసుకొని నెలాఖరులోపు విభజన పూర్తి చేయాలని కోరామన్నారు. జిల్లా స్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభమయ్యాక జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విధివిధానాలు వస్తాయన్నారు. కేసీఆర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ ఇవ్వాలని కోరతామని రాజేందర్​ తెలిపారు.

Next Story

Most Viewed