ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఆసుపత్రి ఎదుట విపక్షాల ధర్నా

by  |
Opposition party leaders
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల కోసం మణుగూరు మండల కేంద్రలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వంద పడకల ఆసుపత్రి నిర్మించింది. 2017 సంవత్సరంలో మూడు కోట్ల పదిహేను లక్షల నాబార్డు వ్యయంతో నిర్మించి, నాటి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారు. అయితే, నాటి నుంచి నేటివరకూ సదురు ఆసుపత్రిలో ప్రభుత్వం వైద్యులను నియమించకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహం వ్యక్తం విపక్షాలు సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుకే పెద్దాస్పత్రిని నిర్మించారని, ఇంతవరకు వైద్యులను మాత్రం నియమించలేదని మండిపడ్డారు. ఆసుపత్రి నిర్మించి దాదాపు ఆరు మాసాలు గడుస్తున్నా.. వైద్యులను నియమించకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అడుతోందని, దీనిపై నాలుగు మండలాల ప్రజలు ఆధారపడి ఉన్నారని అన్నారు. ఇటీవల విషజ్వారాలు విస్తరిస్తూ మండలాల ప్రజలు అల్లాడుతుంటే, పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వానికి ఇంకా సోయి రావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణం అని వారు మండిపడ్డారు. నాలుగు మండలాల ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతుంటే ఎమ్మెల్యే రేగా ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేగాకు, జిల్లా కలెక్టర్‌కు, వైద్యాధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న దృష్టి పెట్టడం లేదన్నారు. ఇప్పటికైనా, ఎమ్మెల్యే రేగా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వైద్యులను నియమించేందుకు కృషి చేయాలని కోరారు. లేకపోతే 4వ తేదీన నాలుగు మండలాలకు బందుకు పిలుపునిస్తామని, 6వ తేదీన రహదారులు దిగ్భందిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో అఖిలపక్ష నాయకులు సారెడ్డి పుల్లారెడ్డి, వట్టం నారాయణదొర, స్టేట్ బీసీ సెల్ సెక్రెటరీ వి.మధుసూదన్ రావు, లింగంపల్లి రమేష్, నిమ్మల వెంకన్న, నూరుదీన్, ముక్కెర లక్ష్మణ్, దుర్గ్యాలా సుధాకర్, ఎస్కే సర్వర్, అక్కి నర్సింహారావు, అనంతనేని సురేష్, పత్తిపాటి నాగేశ్వరావు, మంగివీరయ్య, వీరస్వామి, సర్పంచ్ బాడిష సతీష్, సర్పంచ్ సీతమ్మ, మచ్చల వెంకటేశ్వర్లు, వీరుకొండ ప్రసాద్, కే.వి నారాయణ, వేణు, ఏ.రాములు దందుగుల బాబు, రామనాధం, బేబీ, ఉమర్‌లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed