అన్నదాతకే నీళ్లు ఇస్తలేరు

by  |
అన్నదాతకే నీళ్లు ఇస్తలేరు
X

న్యూఢిల్లీ: దేశానికి అన్నంపెట్టే రైతన్నలకు తాగు నీరు చేరకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. అన్నదాతలకు కనీస హక్కులనూ కల్పించట్లేదని ఆరోపించారు. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతాల్లో సెక్యూరిటీని భారీగా పెంచిన సంగతి తెలిసిందే. రాకపోకలు దాదాపుగా అడ్డుకునేలా బారికేడ్లు, కాంక్రీట్ నిర్మాణాలు, ఇనుప చువ్వలను మేకుల్లా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఘాజీపూర్ నేరుగా చేరుకుని రైతులతో మాట్లాడాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ సారథ్యంలో 10 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 15 ఎంపీలు బయల్దేరారు. కానీ, రైతులతో కలవనీయకుండా చట్టసభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.

బారికేడ్ల వరకూ చేరుకున్న ఎంపీలు రైతులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. అన్నదాతతో కేంద్ర వ్యవహరిస్తున్న తీరు షాక్‌కు గురిచేస్తున్నదని, రైతులను దుర్బేధ్యమైన కోటలకు ఉండే తరహాలో కాంక్రీట్, ఇనుప కంచె, ఎత్తైన బారికేడ్లను ఏర్పాటు చేశారని హర్‌సిమ్రత్ కౌర్ అన్నారు. కనీసం అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లకూ నిరసనవేదికకు వెళ్లడానికి వీల్లేకుండా చేశారని మండిపడ్డారు. భారత సంస్కృతిలో అన్నదాత సుఖీభవ అంటారని, కానీ, అన్నంపెట్టేవారిపైనే దారుణంగా వ్యవహరించడం సరికాదని ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలకు కనీసం తాగు నీటినీ అందించకుండా అడ్డుకుంటున్నదని, వారిని శత్రువుల్లా చూస్తున్నదని కేంద్రంపై డీఎంకే నేత కనిమొళి విమర్శలు గుప్పించారు.


Next Story