మద్యం విక్రయాలు, ధరల పెంపుపై విపక్షాల విమర్శలు

by  |
మద్యం విక్రయాలు, ధరల పెంపుపై విపక్షాల విమర్శలు
X

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల క్రితమే మద్యం అమ్మకాలు ఆరంభమవగా, నేటి నుంచి తెలంగాణలో కూడా విక్రయాలు ఆరంభించారు. ఏపీలో మద్యం విక్రయాలు, ప్రజలు పోటెత్తడం వంటి అంశాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజల రక్షణను ప్రమాదంలోకి నెట్టేశారంటూ మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఏమన్నారన్న వివరాల్లోకి వెళ్తే…


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మద్యం అమ్మకాలపై మండిపడ్డారు. దక్షిణాదిలోని ఏ రాష్ట్రంలో కూడా మద్యం దుకాణాలు తెరవని సమయంలో ఏపీ అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోందని అన్నారు. ఏపీలోని మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే విక్రయిస్తున్నారని.. ఆ బ్రాండ్లను వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కట్టడి సమయం కావడంతో మద్యపాన నిషేధానికి ఇంతకంటే మంచి సమయం లేదని ఆయన ప్రభుత్వానికి సూచించారు.


సినీ నటుడు, జనసేన నేత నాగబాబు దీనిపై స్పందిస్తూ, దేశ వ్యాప్తంగా నిన్న విడుదలైన వారుణి వాహిని సూపర్ హిట్ అయింది అన్నారు. హిట్‌తో పాటు సెన్సేషనల్ టాక్ కూడా సంపాదించుకుందని ఆయన ఎద్దేవా చేశారు. వారుణి వాహిని బాహుబలి, టైటానిక్ సినిమాల కలెక్షన్లను కూడా దాటేసేలా ఉందన్న ఆయన, భారీ వసూళ్లు ఖాయమని విమర్శించారు.

అంతే కాకుండా తనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం… యూపీలో 100 కోట్ల రూపాయలు, ఏపీలో 68 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 45 కోట్ల రూపాయలు తొలి రోజు కలెక్షన్లని, మిగతా రాష్ట్రాల కలెక్షన్ రిపోర్టులు రావాల్సి ఉందని సినిమా భాషలో చెప్పారు. ప్రభుత్వాల నిర్ణయాలను మందుబాబులు మెచ్చుకుంటుంటే, మహిళలు మాత్రం ప్రభుత్వాలను శపిస్తున్నారని ఆయన విమర్శించారు. లాక్‌డౌన్‌పై మోదీ స్ఫూర్తి అత్యున్నత స్థాయిలో ఉందని, ప్రభుత్వ నిర్ణయాలతో కరోనా చాలా సంతోషంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి ఇదే సహకారాన్ని కరోనా కోరుకుంటోందని ఆయన మండిపడ్డారు.


టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ, ప్రాణాంతకమైన మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల గొంతులో పోస్తున్నారని ఆరోపించారు. ఈ దుకాణాల్లో విక్రయించే లిక్కర్‌ను వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుందని హెచ్చరించారు. ఎన్నడూ వినని బ్రాండ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. నాణ్యత లేని మద్యం తయారు చేసే డిస్టిలరీలను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నాణ్యతలేని మద్యాన్ని విక్రయించడమే కాకుండా వాటి ధరలు పెంచడం మరింత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

తెలంగాణలో విక్రయించే పాత బ్రాండ్స్‌నే ఇక్కడ కూడా విక్రయించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు మద్యం దుకాణాలు తెరిచామని ఏపీ మంత్రులు చెప్పడం సరికాదని అన్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసే ఉంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగితే ఓట్లేసేందుకు ఎంతమంది క్యూలో నిలబడతారో మద్యం కోసం దుకాణాల వద్ద అంతమంది బారులు తీరారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


టీడీపీ ఎంపీ కేశినేని నాని దీనిపై స్పందిస్తూ, ‘అమ్మ ఒడి’ పథకం డబ్బులు ‘నాన్న గొంతు తడి’ పథకం కోసం ఖర్చయిపోతున్నాయని అమ్మలు వాపోతున్నారు జగనన్నా అంటూ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో హోటళ్లు లేవని, టీ దుకాణాలు, కాఫీ షాపులు అన్నీ మూతపడినా, జగనన్న మందు షాపులు మాత్రం ఫుల్ టైమ్ ఓపెన్ అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఈ రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని ఆయన వేడుకున్నారు.

Tags: tdp, ysrcp, liquor shopes opening, chandrababu, nagabbu, somireddy



Next Story