హైదరాబాద్‌లో ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబరేటరీ!

by  |
హైదరాబాద్‌లో ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబరేటరీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో హైదరాబాద్‌లో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్ అభివృద్ధితో పాటు దీనికి అవసరమైన స్మార్ట్‌ఫోన్ పరికరాల తయారీ, కెమెరా, బ్యాటరీలను హైదరాబాద్‌లోనే తయరు చేయనుంది. ఈ ల్యాబ్‌కు అనుసంధానంగా పరిశోధనా, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) సెంటర్‌ను కూడా ఇక్కడే నెలకొల్పాలని ఒప్పో మంగళవారం ప్రకటించింది.

అయితే, చైనాకు చెందిన ఒప్పో సంస్థ మొదటిసారిగా చైనాకు వెలుపల తన 5జీ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ, ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభిస్తోంది. ఇదివరకూ ఎక్కడా లేని ల్యాబ్, ఆర్ అండ్ డీ సెంటర్‌లను హైదరాబాద్‌లోనే నెలకొల్పాలని నిర్ణయించడంతో పరిశ్రమలో ప్రాధాన్యత ఏర్పడింది. భారత్‌ను కేంద్రంగా చేసుకుని ఆసియాలోని ఇతర దేశాలకు ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేయడమే కాకుండా స్మార్ట్‌ఫోన్ పనితీరును మరింత మెరుగు పరచాలని భావిస్తున్నట్టు ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ అరిఫ్ చెప్పారు.

భారత్‌లో 5జీ నెట్‌వర్క్ అభివృద్ధికి అవసరమైన పరిశోధనలు జరుగుతున్నాయని, ఇందులో తాముకూడా భాగస్వామ్యం అవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్మించే ల్యాబ్‌ను అత్యాధునిక సాంకేతికతతో పాటు వసతులు, పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు ఒప్పో వ్యాపార లావాదేవీలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ ల్యాబ్, ఆర్ అండ్ డీ సెంటర్లను మాత్రమే ఎక్కడా నెలకొల్పలేదన్నారు. హైదరాబాద్‌లో వీటి ఏర్పాటు చేయడం ద్వారా విదేశాల్లోనూ విస్తరణ మొదలైందని అరిఫ్ వెల్లడించారు.



Next Story