- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Operation Sindoor : భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాలు.. ఎప్పుడెప్పుడు ఎందుకు జరిగాయి?

దిశ, ఫీచర్స్ : పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రమూకలు (Pakistani terrorists) సృష్టించిన నరమేధానికి ప్రతిస్పందనగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వార్ ప్రారంభమై కొనసాగుతోంది. సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతోంది. పాకిస్తాన్ సైన్యాల కుట్రలను ఇండియన్ ఆర్మీ (Indian Army) ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికల్లో, సాధారణ ప్రజల్లో సైతం యుద్ధం గురించే డిస్కషన్ నడుస్తోంది. అయితే భారత్ పాక్ మధ్య యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగాయి? ఎటువంటి పరిణామాలు సంభవించాయో ఇప్పుడు చూద్దాం.
భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలు (Wars between India and Pakistan) మొత్తం దక్షిణాసియా చరిత్రలోనే కీలక ఘట్టాలుగా చరిత్రలో మిగిలిపోయాయి. ప్రధానంగా ఇవన్నీ కాశ్మీర్ సమస్య చుట్టే తిరుగుతాయి. ఒకప్పుడు ఇవి ఒకే దేశంగా ఉండేవని చెబుతారు. కాగా 1947లో బ్రిటీష్ నుంచి స్వాతంత్ర్యం పొందాక భారత్ నుంచి కొంత భాగం విడిపోయి పాకిస్తాన్గా ఏర్పడింది. ఇక అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య 4 ప్రధాన యుద్ధాలు (1947-48, 1965, 1971, 1999), అనేకసార్లు చిన్న స్థాయి సంఘర్షణలు జరిగాయి. ఇవి రాజకీయ, సైనిక, సామాజిక పరిణామాలను క్రియేట్ చేశాయని, రెండు దేశాలమధ్య సంబంధాలను ప్రభావితం చేశాయని నిపుణులు చెబుతారు.
మొదటి ఇండో-పాక్ యుద్ధం (1947-48)
కాశ్మీర్ భారత్ భూభాగంలో విలీనం కావడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. కశ్మీర్ కోసం ఇరు దేశాలు కొట్లాడుకున్నాయి. పాకిస్తాన్ సపోర్ట్తో బార్డర్లోని గిరిజన దళాలు కాశ్మీర్ను ఆక్రమించేందుకు ప్రయత్నించగా, భారత సైన్యం వారిని అడ్డుకుంది. యుద్ధం ముగింపులో ఐక్యరాష్ట్ర సమితి మధ్యవర్తిత్వంతో 1948 సంవత్సరం, ఆగష్టులో కాల్పుల విరమణ జరిగింది. ఫలితంగా, కశ్మీర్లో నియంత్రణ రేఖ (Line of Control - LoC) ఏర్పడింది. ఇది ఇప్పటికీ రెండు దేశాల మధ్య విభజన రేఖగా ఉంది. కాగా ఈ యుద్ధం కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చింది.
రెండవసారి ఇండో పాక్ యుద్ధం, 1965
కాశ్మీర్(Kashmir)లో ఉద్రిక్తతలు పెరగడంతో, పాకిస్తాన్ ‘‘ఆపరేషన్ జిబ్రాల్టర్’’ పేరుతో గెరిల్లా దాడులను ప్రారంభించింది. కానీ భారత్ దీనికి గట్టిగా స్పందించింది. ఈ యుద్ధంలో రెండు దేశాలు భారీ సైనిక నష్టాలను చవిచూశాయి. కాగా సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో 1966లో తాష్కెంట్ ఒప్పందం కుదిరింది. ఇది యథాస్థితిని పునరుద్ధరించింది(Restored the status quo). ఈ యుద్ధం రెండు దేశాల సైనిక సామర్థ్యాలను పరీక్షించింది, కానీ కాశ్మీర్ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.
1971లో మరోసారి యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటు
1971లో భారత్ పాక్ మధ్య యుద్ధం కాశ్మీర్కు సంబంధించినది కాకుండా, ఈస్ట్ పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ప్రత్యేక స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించినది. పాకిస్తాన్ సైన్యం ఈస్ట్ పాకిస్తాన్లో దమనకాండ కొనసాగించడంతో, భారత్ శరణార్థుల రాక, అలాగే ముక్తి బాహినీకి మద్దతు ఇచ్చింది. డిసెంబర్ 1971లో జరిగిన యుద్ధంలో భారత్ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1972లో సిమ్లా ఒప్పందం ద్వారా రెండు దేశాలు శాంతి చర్చలు జరిపాయి. కానీ కాశ్మీర్ సమస్య మళ్లీ అలాగే మిగిలిపోయింది.
కార్గిల్ యుద్ధం, 1999
1999లో కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లోకి పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన వేర్పాటు గ్రూపులు, పాక్ సైనికులు భారత భూభాగంలోకి చొరబడ్డారు. దీంతో స్థానిక స్థాయి(local level) యుద్ధం జరిగింది. భారత సైన్యం ‘‘ఆపరేషన్ విజయ్(Operation Vijay)’’ ద్వారా పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధం అణ్వాయుధ యుగంలో జరిగిన తొలి సంఘర్షణగా పరిగణించబడుతుంది. ఎందుకంటే రెండు దేశాలు 1998లో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాయి. అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ వెనక్కి తగ్గింది, కానీ ఈ సంఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు దేశాల మధ్య ఈ యుద్ధాలు అపనమ్మకాన్ని బలపరిచాయి. దీంతో కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోకుండానే అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్ విషయంలో సమస్య నానుతూనే ఉంది.
నిజానికి కశ్మీర్ భారత్ భూభాగంలో ఉన్నప్పటికీ పాక్ దురాక్రమణకు ప్రయత్నిస్తూ వస్తోంది. అందుకోసం ఉగ్రవాదులను తయారు చేయడం, ఉసిగొల్పడం చేస్తూ వస్తోంది. మరోసారి ఏప్రిల్ 22న (2025) పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది భారత పౌరులను విచక్షణా రహితంగా కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టగా అది ఇప్పుడు యుద్ధరూపం దాల్చింది. ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. భారత్ పాక్ సైన్యాల కుట్రలను అత్యంత సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతోంది.