India: పాక్‌కు బెయిలౌట్ ప్యాకేజీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

by S Gopi |

ఆ దేశానికి ఉన్న భారీ రుణాలు, ఆర్థికవ్యవస్థలో పాక్ ఆర్మీ జోక్యం గురించి ఐఎంఎఫ్ ముందు భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

India: పాక్‌కు బెయిలౌట్ ప్యాకేజీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రతిపాదించిన 1.3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఇదే సమయంలో ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కు బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వడంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని సమర్థవంతంగా ఉపయోగించడంలో పాక్‌కు పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉందని వివరించింది. ఉగ్రవాదానికి ఐఎంఎఫ్ నిధులను పాక్ వాడుతోందని, ఆ దేశానికి ఉన్న భారీ రుణాలు, ఆర్థికవ్యవస్థలో పాక్ ఆర్మీ జోక్యం గురించి ఐఎంఎఫ్ ముందు భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక విధానాల్లో నైతిక పరిశీలనల అవసరాన్ని భారత్ ప్రస్తావించింది. ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్గాంలో 26 మందిని హతమార్చడం, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో ఈ సహాయానికి సంబంధించిన షరతుల విషయంలో పాకిస్తాన్ పదేపదే ఉల్లంఘించిందని భారత్ తెలిపింది. పాక్‌కు ఆర్థిక సాయం చేస్తే అది పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు, భారత్‌పై దాడి కోసం లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఇస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేని పాక్‌కు ఆర్థిక సాయం చేయడంలో అప్రమత్తంగా ఉండాలని ఐఎంఎఫ్‌ను కోరింది. కాగా, పాకిస్తాన్‌కు 7 బిలియన్ డాలర్ల సాయంలో భాగంగా మొదటి సమీక్షలో ఐఎంఎఫ్ బోర్డు శుక్రవారం 1 బిలియన్ డాలర్లు నగదును విడుదల చేసిందని పాక్ ప్రభుత్వం ప్రకటించుకుంది. దీనిపై ఐఎంఎఫ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Next Story