భారత పవర్‌గ్రిడ్‌పై సైబర్ దాడి.. పాక్ మరో ఫేక్ ప్రచారం.. తేల్చిన ఫ్యాక్ట్‌చెక్‌

by D.Reddy |   ( Updated:2025-05-10 04:28:05.0  )
భారత పవర్‌గ్రిడ్‌పై సైబర్ దాడి.. పాక్ మరో ఫేక్ ప్రచారం.. తేల్చిన ఫ్యాక్ట్‌చెక్‌
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఇరు దేశాలు పరస్పరం ప్రత్యేక్ష దాడులకు దిగాయి. అయితే, భారత సైనిక దళాలను నేరుగా ఎదురుకోలేకపోతున్న దాయాది దేశం సోషల్‌ మీడియాలో (Social media) వక్రబుద్ధిని చాటుకుంటోంది. నెట్టింట అసత్య (Fake news) ప్రచారాలకు తెరతీసింది. పాతవి కొత్తగా.. లేనిది ఉన్నట్లు.. జరగనిది జరిగినట్లు.. పాక్‌ కలరింగ్‌ ఇస్తోంది. ఇక పాక్ చేస్తున్న ఈ అసత్య ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియాలో పలు అంశాలు ప్రచారం కాగా, వాటిపై పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ చేసి, దేశప్రజలకు వాస్తవాలకు నివేదించింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి పాకిస్థాన్ ఫేక్ న్యూస్‌ను వైరల్ చేసింది.

భారతదేశంలో 70శాతం విద్యుత్‌ గ్రిడ్‌ సైబర్‌ దాడికి గురై పని చేయడం లేదని పాక్‌కు చెందిన సోషల్‌ మీడియా ఖాతాల్లో అసత్య సమాచారం ప్రచారం అవుతోంది. ఈ దుష్ప్రచారాన్ని ప్రాథమికంగా పరిశీలించిన పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం, ఇది పూర్తిగా నకిలీ ప్రచారమని తేల్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్టులు ప్రజల్లో గందరగోళం కలిగించేందుకు ఉద్దేశించినవేనని అధికారులు స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎలాంటి పెద్ద ఎత్తున సైబర్‌ దాడి జరగలేదని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ కూడా ధృవీకరించింది. ఇక ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని, అధికారిక వర్గాల నుంచే సమాచారం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed