నో క్యాష్.. ఓన్లీ ఆన్ లైన్..!

by  |
నో క్యాష్.. ఓన్లీ ఆన్ లైన్..!
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావం అనేక కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ప్రజలు అనేక తిప్పలు పడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలకలాపాలన్నీ మూతపడగా.. మరో వైపు దైనందిన జీవితానికి కావాల్సిన నిత్యావసర వస్తువల కొనుగోలు వ్యవహారం పెద్ద ప్రహాసనంగా మారుతోంది. ధనికులైతే పరిస్థితులకు అనుగుణంగా కావాల్సిన సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకోగల శక్తి, సామర్థ్యాలు ఉంటాయి. నిత్యావసరాలను ఏ రోజుకారోజు కొనుగోలు తెచ్చుకునే పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితే ఆగమ్యగోచరంగా తయారవుతోంది. అసలే రోజువారీ పనులు లేకపోవడంతో, ఇంట్లో పొదుపుగా దాచుకున్న నాలుగైదు రూపాయాలతోనే సరుకులు తెచ్చుకోవడం, ప్రతిరోజూ అందులో రేపటికి కొంత మిగుల్చుకోవడం లాంటి దినచర్యలతో సామాన్యులు కొద్దిపాటి యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉదయం లేవగానే పాల ప్యాకెట్, నిత్యావసరాలకు వెళ్ళగా గూగుల్ పే ఉందా.. పే టీఎం ఉందా అంటూ సదరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.

భయపడుతున్న వ్యాపారులు…

ప్రపంచం వ్యాప్తంగా కరోనా అంటేనే ప్రాణభయం పట్టుకుంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ క్రమేణా భారత్ చేరుకుంది. కరోనా లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండడంతో ఇప్పుడు భారతీయులంతా దాదాపుగా స్వీయ క్రమశిక్షణకు నడుం బిగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ ప్రకటించడం, విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా అనుమానితులుగా భావిస్తున్న వారంతా క్వారంటైన్ (స్వీయ నిర్భంధం) కావాలని పదే పదే చెబుతున్న సంగతి తెల్సిందే. అంతే కాకుండా, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యక్తుల మధ్య కశ్చితంగా 1 మీటరుకు పైగా సామాజిక దూరం పాటించాలని, నాలుగైదురుగురు గుమిగూడి ఉండవద్దని తదితర జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అన్నింటికంటే మించి గంటకోసారి చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలు, ఇతర నిత్యావసర సరుకుల కొనుగోలు చేసిన ప్రజల నుంచి నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు, దుకాణాదారులు తీవ్ర భయాంధోళన చెందుతున్నారు.

నో క్యాష్.. ఓన్లీ ఆన్ లైన్…

కొనుగోలు చేసిన వస్తువులకు నగదు రూపంలో చేస్తున్న చెల్లింపులను వ్యాపారులు తిరస్కరణ చేస్తున్నారు. నోట్ల ద్వారానే కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందంటూ ప్రశ్నించిన ప్రజలకు చిరు వ్యాపారులు సమాధానం చెబుతున్నారు. నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ ప్రాంతంలో ఓ వ్యక్తి పాల ప్యాకెట్ కొనుగోలు చేసినందుకు క్యాష్ తీసుకోకపోవడంతో.. పాల ప్యాకెట్ చెల్లించాల్సిన మొత్తాన్ని గూగుల్ పే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసినట్టు సదరు వ్యక్తి చెప్పారు. మరికొందరైతే, గూగుల్ పే ఉన్నా.. అకౌంట్ లో డబ్బులు నిల్వ లేనందున పాల ప్యాకెట్ తీసుకోకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకుంది. కరోనా కర్ఫ్యూ కొనసాగుతున్నంత కాలం నగరంలోని పలు ప్రాంతాల్లో సామాన్యులకు ఈ తరహా కష్టాలు తప్పేట్టు కన్పించడం లేదు. అయితే, వీటికి ప్రభుత్వమే ఏదైనా పరిష్కార మార్గాలను చూపించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఇంకా ఈ తిప్పలు ఇంకెన్నాళ్ళు అంటూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tag: Coronavirus, Online Payment, Hyderabad

Next Story

Most Viewed