నిఘా లేని రైల్వే.. దేశంలో సీసీటీవీలు ఉన్న స్టేషన్లు పది శాతమే..

by  |
cc tvs in indian railway stations
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవాసులతో మమేకమైన భారతీయ రైల్వేను ప్రజల నుంచి వేరు చేసి చూడలేం. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతూ, సరుకుల రవాణాతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదుతున్న సంస్థ ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద నెట్‌వర్క్ కలిగిన మన రైల్వేలో నిఘా మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. దేశవ్యాప్తంగా పట్టుమని పది శాతం రైల్వే స్టేషన్లలో మాత్రమే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరా (సీసీ టీవీ)లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

గ్రామస్థాయిలలో ఉండే రైల్వే స్టేషన్లలోనూ రైలు ఎక్కేప్పుడు, దిగేప్పుడు వందలాది మంది ప్రయాణికులు స్టేషన్లకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక టౌన్‌లు, పట్టణాల్లో అయితే రైల్వే స్టేషన్ అంటే అదో చిన్నపాటి జన సముద్రమే. కానీ వారి భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. దేశం మొత్తమ్మీద ఏడు వేలకు పైగా రైల్వే స్టేషన్లుంటే అందులో 686 స్టేషన్లలోనే సీసీటీవీ కెమెరాలు ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ఇదే విషయమై సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు గోయల్ సమాధానమిస్తూ… దేశంలోని 686 రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చామని అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారిని భద్రతా సిబ్బంది ద్వారానే గుర్తిస్తున్నామని తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు అనుమానం వస్తే వారిని గుర్తించి తక్షణమే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

కాగా, దేశవ్యాప్తంగా 7,349 రైల్వే స్టేషన్లు ఉండగా అందులో 686 స్టేషన్ల (పది శాతం) మాత్రమే సీసీటీవీలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. సీసీటీవీలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర (156), యూపీ (69), బీహార్ (47) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌లో ఒక్క రైల్వే స్టేషన్‌లోనే సీసీటీవీ కెమెరాలు ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒక్క స్టేషన్ లో కూడా లేవు.



Next Story

Most Viewed