స్తంభించిన రాష్ట్రం.. కొనసాగుతున్న బంద్​

by  |
స్తంభించిన రాష్ట్రం.. కొనసాగుతున్న బంద్​
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా శుక్రవారం పరిరక్షణ కమిటీ చేపట్టిన రాష్ర్ట బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. రోడ్లపై వామపక్షాలు, కార్మిక సంఘాల నినాదాలు మారుమోగుతున్నాయి. విశాఖలో అటు స్టీల్​ప్లాంటు కార్మికులతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు బంద్​లో పాల్గొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ముందుగానే మద్దతు ప్రకటించడంతో ఆర్డీసీ బస్సులు బయటకు రాలేదు. విద్యా సంస్థలు తెరుచుకోలేదు. బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకునే అవకాశం లేదు. ఏపీ ఎన్జీవోలూ బంద్​లో పాల్గొంటున్నారు. రాజమండ్రిలో ఆంధ్రా పేపర్​మిల్లు వద్ద కార్మికులు ర్యాలీ చేశారు.

ఉదయం ఆరు గంటల నుంచే ఉక్కు కార్మికులు, ఉద్యోగులు, వామపక్షాల కార్మిక సంఘాలు రహదారులపై నినాదాల హోరెత్తిస్తున్నారు. విజయవాడలో లారీ ట్రాన్స్​పోర్టు అసోసియేషన్​ఆధ్వర్యంలో బంద్​కొనసాగుతోంది. తిరుపతిలో వ్యాపారులు స్వచ్చందంగా దుకాణాలు మూసి వేశారు. ఇంకా అన్ని జిల్లా కేంద్రాల్లో బంద్​వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలు విశాఖ ఉక్కు మా హక్కంటూ నినదిస్తున్నారు. బంద్​కు ప్రభుత్వం మద్దతు తెలిపింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు అక్కడక్కడా వామపక్షాలతో కలిసి బంద్​కు మద్దతు తెలియజేస్తున్నారు. బంద్​లో పాల్గొనేందుకు చంద్రబాబు విశాఖలోనే ఉన్నారు.

విశాఖలో స్టీల్ ప్లాంటు పరిరక్షణ కమిటీ నేత అయోధ్యరాం మీడియాతో మాట్లాడుతూ స్టీల్​ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ర్ట ప్రజలు బంద్​పాటిస్తుంటే వైసీపీ శ్రేణులు బయటకు రాకపోవడం వారి ద్వంద్వ విధానాలు తెలుస్తున్నాయన్నారు. పార్లమెంటులో ఎంపీలు మాట్లాడకుండా ఇక్కడ ప్రైవేటీకరణకు తామూ వ్యతిరేకమని చెప్పడంలో అర్థం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. నాడు ఉక్కు ఫ్యాక్టరీ కోసం 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నేడు స్టీలు ప్లాంటును రక్షించుకోవడానికి వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు.

ఓవైపు ప్రధాని మోడీ స్టీల్​ప్లాంటు అమ్మడానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించినా అధికార పార్టీలో చలనం లేకపోవడం దారుణమన్నారు. పోస్కో కంపెనీతో ఒప్పందం గురించి ముందే తెలిసినా ఇంకా ఎందుకు మౌనం వహిస్తున్నారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే రిజర్వేషన్లు ఉండవని హెచ్చరించారు. భవిష్యత్తులో ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు వచ్చే అవకాశమే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed