10 రోజుల్లో లక్ష కేసులు.. 3రోజుల్లో వెయ్యి మరణాలు

by  |
10 రోజుల్లో లక్ష కేసులు.. 3రోజుల్లో వెయ్యి మరణాలు
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వైరస్ జడలు విప్పుతోంది. అంతకంతకు విస్తరిస్తూ కమ్మేస్తున్నది. ప్రతిరోజూ రికార్డు స్థాయి కొత్త కేసులతో కలవరపెడుతున్నది. ఫిబ్రవరిలో మన దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటికీ గత నెలలో ఊహించని వేగంతో వ్యాపించింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం మూడు లక్షల(3,20,922) కేసుల్లో దాదాపు రెండున్నర లక్షలు కేవలం గడిచిన నెల వ్యవధిలోనే రిపోర్ట్ అయ్యాయి. చివరి 10రోజుల్లోనే దాదాపు లక్షల కేసులు వెలుగుచూడటం గమనార్హం. జూన్ 5వ తేదీన దేశంలోని మొత్తం 2,26,770 కేసులుండగా ఆదివారం నాటికి అవి 3.20 లక్షలకు చేరాయి. మే 14న 78,003 కేసులున్నాయి. జూన్ 14నాటికి వాటికి అదనంగా 2,42,919 కేసులు చేరాయి. అంటే మార్చి మొదలు ఏప్రిల్ సహా మే 14 నాటికి దేశవ్యాప్తంగా 78వేల కేసులు నమోదవ్వగా కేవలం నెల వ్యవధిలోనే(జూన్ 14 నాటికి) దాదాపు రెండున్నర లక్షల కేసులు రిపోర్ట్ అయ్యాయి. లక్ష మార్కును భారత్ మే 19న దాటేయడం గమనార్హం.

దేశంలో కరోనాతో తీవ్రంగా నష్టపోయిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలూ గతనెలలో భారీగా కేసులను నమోదుచేశాయి. మహారాష్ట్ర, తమిళనాడులు నెల వ్యవధిలో కేసులను నాలుగు రెట్లకు పెంచుకున్నాయి. మే 14న మహారాష్ట్రలో 26,964, తమిళనాడులో 9,518 కేసులుండగా, జూన్ 14నాటికి అవి వరుసగా 1,04,568కు, 42,687లకు చేరాయి. కాగా, ఢిల్లీలో కేసులు ఇంకా విపరీతంగా పెరిగాయి. మే
14న 8,305 కేసులుండగా, జూన్ 14నాటికి అవి 38,958లకు చేరాయి.

మరణాల్లో 9వ స్థానం: డబ్ల్యూహెచ్‌వో

అత్యధిక కేసుల్లో అమెరికా, బ్రెజిల్, రష్యాల తర్వాత నాలుగో స్థానంలో భారత్ ఉండగా, తాజాగా కరోనా మరణాల్లో మన దేశం తొమ్మిదో స్థానంలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలిస్థానంలో అమెరికా(1,14,446) ఉండగా, తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ (41,828), యూకే (41,481), ఇటలీ(34,223) దేశాలున్నాయి. అటుతర్వాత నాలుగు దేశాలు ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికో, బెల్జియంల తర్వాత భారత్ నిలిచింది. ఆదివారం నాటికి మనదేశంలో కరోనా మరణాలు 9,195కి చేరినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీల నుంచే దాదాపు మూడింట రెండు వంతుల కరోనా మరణాలు నమోదయ్యాయి. కేవలం గడిచిన మూడు రోజుల్లోనే వెయ్యికిపైగా కరోనా మరణాలు దేశంలో సంభవించాయి. జూన్ 11న మనదేశంలో 8102 మంది కరోనాతో కన్నుమూయగా, జూన్ 14నాటికి ఈ సంఖ్య 9,195కి పెరిగింది.



Next Story

Most Viewed