నిజామాబాద్‌లో ఒక V చిత్రం.. ఒకే ఇంట్లో మూడు జెండాలు..!

by  |
simgle-family-tree-partys
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు. కొంతకాలం మంత్రిగానూ పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడిగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన ఇంటిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఇప్పుడు హవా సాగించాలని ఆరాటపడుతున్న మూడు పార్టీల నుంచి ఆ ఇంటి సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో కండువా కప్పుకుంటున్నారు. డి. శ్రీనివాస్​ ప్రస్తుతం టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. చాలా కాలం నుంచి ఆయన ఆ పార్టీతో సంబంధాలను వదులుకున్నారు.

ఆయన తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో ఉంటూ నిజామాబాద్​ లోక్‌సభ​ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న డీఎస్ మరో తనయుడు సంజయ్​ మళ్లీ తెరపైకి వచ్చారు. టీపీసీసీ చీఫ్ ​రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం సంజయ్ జిల్లా నేతలతో‌ పాటుగా మహబూబ్‌నగర్‌కు చెందిన ఎర్రశేఖర్, ఉమ్మడి వరంగల్‌కు చెందిన గండ్ర సత్యనారాయణను తీసుకుని రేవంత్‌రెడ్డిని కలిశారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నేతలు.. మూడు పార్టీలో కీలకంగా ఉండాలని చూస్తున్నారు. డీఎస్ మాత్రం టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ, తన ఇద్దరు కుమారులను రెండు పార్టీలకు దగ్గర చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

Next Story

Most Viewed