చాలా సింపుల్‌గా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు

by  |
Olympics
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి మరొక్క రోజే మిగిలి ఉన్నది. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడిన ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతీ నాలుగేళ్లకు వచ్చే ఒలింపిక్స్‌లో ఈ సారి జోష్ తగ్గిపోయింది. కరోనా భయాందోళనలు ఇంకా వెంటాడుతుండటంతో పూర్తి ఆంక్షల నడుమ ఒలింపిక్స్ జరుగనున్నాయి.

సాధారణంగా ఒలింపిక్స్ జరుగుతున్నాయంటే ఆ నగరంలోనే కాకుండా దేశమంతా సంబరాల్లో మునిగిపోతుంది. అథ్లెట్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఒక చోట చేరతారు. కానీ ఈ సారి విదేశీ, స్వదేశీ ప్రేక్షకులను కూడా అనుమతించకుండా ఖాళీ స్టేడియంలలో ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. అథ్లెట్లు కూడా సాధ్యమైనంత వరకు క్రీడాగ్రామం, పోటీలు జరిగే చోటు తప్ప మిగతా చోట్ల తిరగడాన్ని నిషేధించారు. టోక్యోలో ఒలింపిక్స్ జరుగుతున్నా.. ఆ సందడి మాత్రం కనపడటం లేదంటే ఎన్ని ఆంక్షలు నిర్వాహక కమిటీ విధించిందో అర్దం అవుతున్నది.

ప్రారంభ వేడుకలు సింపుల్..

ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలు చాలా ధూం ధాంగా నిర్వహిస్తుంటారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు అందరూ పరేడ్ చేయడం.. డ్యాన్సులు, పాటలతో కళాకారులు హోరెత్తించడం జరుగుతుంది. ఒలింపిక్స్ జరుగుతున్న దేశానికి సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రస్పుటించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి వేడుకలను మాత్రం చాలా సాధారణంగా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. పరేడ్‌లో కూడా 10 వేల మంది అథ్లెట్లు కాకుండా.. ఆయా దేశాల నుంచి నిర్ణయించిన 1000 మంది పతాకధారులు మాత్రమే పరేడ్‌లో పాల్గొననున్నారు. బాణసంచా పేలుళ్లు, మ్యూజికల్ నైట్స్ పూర్తిగా రద్దు చేశారు.

గతంలో చాలా దేశాలకు చెందిన అధినేతలు ప్రారంభ వేడులకు వచ్చే వాళ్లు. కానీ ఈ సారి 15 దేశాలకు చెందిన నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపారు. అయితే వారిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మక్రాన్, మంగోలియా ప్రధాని లవ్‌సన్నామ్‌స్రాయ్ ఓయూన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరవుతున్నారు. జపాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది దేశాధినేతలు తమ పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టోక్యో చేరుకున్న వారిలో 70 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాబట్టి అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పరేడ్‌కు ఆహ్వానించడం లేదని చెప్పారు. కేవలం తమకు సంబంధించిన క్రీడా పోటీలు ఉన్న రోజుల ఆయా వేదికల వద్దకు అనుమతిస్తారు. మిగతా సమయం అంతా క్రీడాగ్రామంలోని తమ గదుల్లో గడపాల్సిందే.

చాలా జాగ్రత్తగా ఇండియన్స్..

భారత అథ్లెట్ల బృందం టోక్యోలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒలింపిక్ పరేడ్ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించకపోవడంతో అందరూ క్రీడా గ్రామానికే పరిమితం కానున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ముందుగా నిర్ణయించినట్లు మేరో కోమ్ ప్రారంభ వేడుకలో పతాకధారిగా పాల్గొననున్నది. ఆమెతో పాటు మరో ఐదుగురు అథ్లెట్లకు మాత్రమే పరేడ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా టోక్యోకు వెళ్లారు. కానీ ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉండటంతో ప్రారంభ వేడుకలకు హాజరు కారని తెలుస్తున్నది.

భారత అథ్లెట్లకు మూడంతస్తుల భవనంలో గదులు కేటాయించారు. సాధ్యమైనంతగా భారత అథ్లెట్లను అక్కడే ఉండాలని అధికారులు ఆదేశించారు. తమతో పాటు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న దక్షిణాఫ్రికా, బెల్జియం క్రీడాకారులతో కలవకూడదని నియమం పెట్టారు. ఇక క్రీడాగ్రామంలో ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్‌లో తప్పనిసరిగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని నియమం ఉన్నది. అక్కడ భారతీయ వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వెజ్‌లో కేవలం చోలే భటూరే, ఓక్రా, వంకాయ లాంటివే ఉన్నాయి. కానీ నాన్ వెజ్‌లో చాలా ఐటమ్స్ అథ్లెట్ల కోసం సిద్దపరుస్తున్నారు. ఇండియన్ అథ్లెట్ల కోసం అక్కడ ప్రత్యేక కార్నర్ ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed