84 ఏళ్ల వృద్ధుడు రాసిన లేఖ.. వైరల్

by  |
84 ఏళ్ల వృద్ధుడు రాసిన లేఖ.. వైరల్
X

దిశ, ఏపీ బ్యూరో: ఈ వయసులో పోరాడలేక నిస్పృహతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ 84 ఏళ్ల వృద్ధుడు రాసిన ఆత్మహత్య లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా ద్వారా తన ఆత్మహత్యకు కారణాలు తెలియాలన్న లక్ష్యంతో ఐదు పేజీల సూసైడ్ నోట్ రాసిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పంచాయతీ అధికారిగా రిటైర్ అయిన కొరుకొండ లక్ష్మీ పతిరావు (84) పశ్చిమగోదావరి జిల్లా తణుకు సజ్జాపురంలో తన ఇంటి పక్కనే సొంత స్థలంలో జయలక్ష్మీ రెసిడెన్సీ పేరిట అపార్ట్ మెంట్ నిర్మించి, ఐదో అంతస్తులోని ఒక ఫ్లాట్ ఆధీనంలో ఉంచుకుని మిగతావి విక్రయించారు.

ఆ ఫ్లాట్‌ను అద్దెకు ఇస్తూ, అపార్టమెంట్ మెయింటెనెన్స్ వ్యవహారాలు చూసుకునేవారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌లో కమిటీ ఏర్పాటు చేసి బాధ్యతలు వారికి అప్పగించారు. ఈ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న లక్ష్మీ కుమారి, శేష అనే ఇద్దరు తనతో వాగ్వాదానికి దిగుతూ క్షోభకి గురి చేస్తున్నారు. వాచ్‌మెన్ అబ్రహాంతో కలిసి తనపై తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని హెచ్చరించి పంపేశారు. అయినప్పటికీ వారి వేధింపులు ఆగడం లేదు. దీంతో ‘నా వయసు 84 సంవత్సరాలు.. అపార్టుమెంటు కమిటీ సభ్యులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.. నన్ను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు.. ఈ వయసులో నాకు పోరాడే శక్తి లేదు.. ఇలాంటి పోలీసు కేసులు ఎదుర్కొనే సహనం లేదు.. అందుకే నిస్పృహతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను..’ అంటూ ఐదు పేజీల సూసైడ్ లేఖ రాసి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Next Story