ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు బుకింగ్స్ ప్రారంభం

by  |
ola scooters 1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా వివరాలను వెల్లడించారు. ‘భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విప్లవం ప్రారంభమైంది. ఓలా స్కూటర్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించాం. అంతర్జాతీయ ఈవీ మార్కెట్లో లీడర్‌గా భారత్ ఎదిగేందుకు తగిన సామర్థ్యం కలిగి ఉందని, దీనికి తాము నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని’ ఆయన అన్నారు. సరికొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు రూ. 499 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.

కొత్త ఈ-స్కూటర్ సెగ్మెంట్ బేస్ట్ ఫీచర్లతో వస్తుందని, స్కూటర్‌లో అత్యుత్తమ బూట్ స్పేస్ కూడా ఉంటుందని భవిష్ అగర్వాల్ చెప్పారు. కీ అవసరం లేకుండా యాప్ ద్వారా ఈ స్కూటర్‌ను స్టార్ట్ చేసే సదుపాయం ఉంటుందని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఈ-స్కూటర్ ఫీచర్లు, ధరల వివరాలను ప్రకటించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విస్తృత స్థాయిలో వినియోగదారులకు చేరువ చేసేందుకు ఆకట్టుకునే ధరను నిర్ణయిస్తామని, ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత కల్పిస్తూ డెలివరీలను చేపట్టనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓలా స్కూటర్‌ను 50 శాతం ఛార్జింగ్ చేయడం ద్వారా 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని, పూర్తిగా ఒకసారి ఛార్జ్ చేసి 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed