ఓలా ఉద్యోగుల తొలగింపు

by  |
ఓలా ఉద్యోగుల తొలగింపు
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని కొన్ని నెలలుగా వినిపిస్తున్న మాటే.. అయితే, లాక్‌డౌన్ వల్ల ఇన్నిరోజులు ప్రమాదమేమీ లేదనుకున్నారు కానీ… లాక్‌డౌన్ ఆంక్షలు పాక్షికంగా ఎత్తేసిన వెంటనే పలు సంస్థలు ఆదాయం కోల్పోయామనే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇటీవల ఫుడ్ డెలివరీ సంస్థ వందల మందిని తొలగించగా, ఉబర్ దాదాపు 3 వేల మందిని తొలిగిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. గడిచిన రెండు నెలలుగా 95 శాతం ఆదాయం క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. ఓలా రైడ్స్, ఫుడ్ బిజినెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి సుమారు 1400 మందిని తొలగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశామని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల లక్షల మంది తమ డ్రైవర్లు, వారి కుటుంబాలు జీవనోపాధిపై ప్రభావితం ఉందని సీఈవో తెలిపారు. అసాధారణమైన ఈ పరిస్థితుల మధ్య తమపై దీర్ఘకాలం ప్రభావం ఉండనుందని ఆయన వివరించారు. దేశంలో మార్చి నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు విధించడంతో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో క్యాబ్ సేవలందించే ఉబర్, ఓలా వంటి సంస్థల సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ పరిణామాలతో ఆదాయాలు లేకపోవడంతో ఈ సంస్థలు క్రమంగా ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.


Next Story