ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి

by  |
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో ప్రోత్సహించాల్సిన అవసరముందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం టీ సాట్ చానెల్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల అవసరాలకు ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరమున్నప్పటికీ 7 మిలియన్ టన్నుల నూనె గింజలను మాత్రమే సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలను పొందవచ్చని సూచించారు.

ఆయిల్ పామ్‌తో పాటు నువ్వులు, కుసుమ, వేరుశనగ తదితర నూనెగింజల సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించి ఎకరాకు రూ.36 వేలు సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్థానిక బ్యాంకులను టై అప్ చేసి రైతులకు రుణాలు ఇప్పించే ప్రక్రియ కూడా ప్రభుత్వమే చేపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో అవసరాలకు మించి వరి ధాన్యం దిగుబడులు వస్తుండటంతో భవిష్యత్ లో వరిసాగు చేసే రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పారు.

ఇందుకోసమే మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను అధ్యయనం చేసి డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. సాఫ్ట్ వేర్ రంగం బలోపేతంతో దాదాపు 6.5 లక్షల మందికి ఉపాధి లభించిందని మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని తెలిపారు.


Next Story

Most Viewed