ఇందిరా పార్కులో ఒడ్డెక్కిన బోట్లు.. ఇంత నిర్లక్ష్యమా..?

by  |
ఇందిరా పార్కులో ఒడ్డెక్కిన బోట్లు.. ఇంత నిర్లక్ష్యమా..?
X

నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరాపార్కుకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు తరలివస్తుంటారు. కాంక్రిట్ ​జంగిల్​గా మారిన నగరంలో ప్రకృతి అందాలతో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు, ఆహ్లాదకరమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం ఇట్టే ఆకట్టుకుంటాయి. గతంలో పార్కులో తిరుగుతూ, సరదా బోటింగ్ చేస్తూ ఎంజాయ్​చేసేవారు. ఇటీవల బోటింగ్ ​నిలిపివేయడంతో సందర్శకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాంట్రాక్టు కాలపరిమితి ముగియడంతో బోటింగ్​నిలిపివేశారు. బోటింగ్​కొలను సైతం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఇప్పటికైనా బోటింగ్​అందుబాటులోకి తీసుకురావాలని సందర్శకులు కోరుతున్నారు.

దిశ, ముషీరాబాద్: నిత్యం ఉరుకుల పరుగల జీవితంలో మనిషి కాస్త స్వాంతన పొందేందుకు పార్కులను ఆశ్రయిస్తుంటాడు. అక్కడ అడుగు పెడితే చాలు ప్రకృతి పలకరిస్తుంది. నగరం నడిబొడ్డున్న ఉన్న ఇందిరాపార్కకు ప్రతీ రోజు వందల సంఖ్యలో సందర్శకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే పార్కు సందర్శకులతో కిటకిటలాడుతూ దర్శనమిస్తుంది. ఇందిరాపార్కలో ప్రకృతి అందాల మద్య ఉన్న నీటి కొలనులో ఎంతో మంది బోటింగ్ చేస్తూ ఆనందాన్ని పొందేవారు. కరోనా కారణంగా లాక్ డౌన్ లో గతేడాది పార్కు చాలా రోజులు మూతపడింది. లాక్ డౌన్ అనంతరం పార్కులు తెరుచుకున్న తర్వాత కొద్ది రోజులే సందర్శకులకు బోటింగ్ చేసే అవకాశం లభించింది. తర్వాత కాంట్రాక్ట్ ముగియడంతో ఇందిరాపార్కులో బోటింగ్ ను నిలిపివేశారు. దీంతో ప్రకృతి అందాల నడుమ బోటింగ్ చేయాలని ఇందిరాపార్కుకు వచ్చే సందర్శకులకు నిరాశే మిగులుతోంది.

మురుగుమయమైన నీరు..

ఇందిరాపార్కులో బోటింగ్ చేసే ప్రాంతంలో నీరు పూర్తిగా మురుగునీటి గుంతగా మారింది. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వాకర్స్, సందర్శకులు పేర్కొంటున్నారు. దుర్గంధం వెలువడుతుండడంతో అటు వైపు వెళ్లేందుకు సందర్శకులు సైతం ఆసక్తి కనబర్చడంలేదు. లాక్ డౌన్ తర్వాత కొద్ది రోజులు బోటింగ్ కొనసాగినప్పటికీ కాంట్రాక్ట్ పూర్తవడంతో నిలిపివేశారు. తిరిగి బోటింగ్ కాంట్రాక్ట్ ఎవరికీ అప్పగించలేదు. కొన్ని నెలలుగా ఇందిరాపార్కులో బోటింగ్ సౌకర్యం లేకపోవడంతో సందర్శకులు నిరాశతో వెనుదిరిగి పోతున్నారు.

ఇక ముందైనా బోటింగ్ చేసే కల నెరవేరుతుందా లేదా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎండా కాలం కావడంతో సాయంకాలం పార్కుకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. పార్కు అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తున్నప్పటికీ బోటింగ్ కొలను శుభ్రం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగుమయమైన బోటింగ్ సరస్సును శుభ్రం చేయించాలని, వెంటనే కాంట్రాక్టుకు టెండర్లు పిలిపించి పార్కులో బోటింగ్ అందుబాటులోకి తీసుకురావాలని సందర్శకులు కోరుతున్నారు.

అందుబాటులోకి తీసుకువస్తాం..

లాక్ డౌన్ కారణంగా చాలా కాలం పార్కు మూత పడింది. లాక్ డౌన్ అనంతరం కొద్దిరోజులు బోటింగ్ కొనసాగించాం. కాంట్రాక్ట్ ముగియడంతో బోటింగ్ నిలిచిపోయింది. కరోనా తిరిగి విజృంభిస్తుండడంతో పార్కుకు పిల్లలు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని బోటింగ్ కు తిరిగి టెండర్లు పిలవలేదు. జోనల్ కమిషనర్ అనుమతి తీసుకుని బోటింగ్ కు టెండర్లు పిలుస్తాం. వీలైనంత త్వరలో బోటింగ్ ను సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తాం. –మాలిని, డిప్యూటీ డైరెక్టర్ పార్క్స్ సికింద్రాబాద్ జోన్



Next Story