బయటపడ్డ ఎస్సై బాగోతం..

by  |
బయటపడ్డ ఎస్సై బాగోతం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలీస్ శాఖ అవినీతిమయంగా మారిపోయింది. కాసులు ముట్ట చెప్పందే , కేసులు పరిష్కారం అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఫ్రెండ్లీ పోలీస్ మాట పక్కన పెట్టి కేవలం డబ్బులు ఉంటేనే కేసు పరిష్కరిస్తామన్న పరిస్థితి నెలకొంది. ఇటీవలే మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో వారిలో ఎస్ఐని విఆర్ లోకి బదిలీ చేసి ఉన్నత అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇదే కేసులో లక్ష రూపాయలు డిమాండ్ చేసిన అధికారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీన వైఖరి అవలంబించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి ఎస్సై పాండ్రేరావు మరో అవినీతి బాగోతం బయటపడింది. మొన్నటి వరకు ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ప్రసాద్, ఎస్సై పాండ్రేరావు అవినీతి బాగోతాన్ని స్వయంగా సీపీ కి నివేదించడంతో ఎస్సైపై విచారణకు ఆదేశించారు.

విచారణలో ఎస్సై పాండే రావు అక్రమ వసూళ్ల పర్వం నిజమని తేలడంతో సీపీ కార్తికేయకు నివేదిక అందించారు. ఈ నివేదికను సీపీ కార్తికేయ ఉన్నతాధికారులకు పంపించారు. ఉన్నతాధికారుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదం కేసులో లారీ యజమానిని కేసునుంచి తప్పించేందుకు 30 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. అదేవిధంగా దంపతుల గొడవ విషయంలో 20 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు తేలింది. అవినీతి పోలీస్ అధికారి వసూళ్ల పర్వం నివేదికలో పొందుపరచిన అధికారులు చర్యలకు సిఫార్సు చేశారు. సీపీ నివేదిక ఆధారంగా ఎస్సై పాండ్రేరావుని సస్పెండ్ చేస్తూ రేంజ్ ఐజీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు

Next Story