అధికారులు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు బాధ్యతగా పనిచేయాలి

by  |
Minister Koppulaishwar
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికారులు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేస్తున్నందునే తెలంగాణ ఎస్సీ, మైనారిటీ గురుకులాలకు దేశంలోనే మంచి పేరొచ్చిందని, మరింత బాధ్యతగా పనిచేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పులఈశ్వర్ సూచించారు. మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో సోమవారం జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఎస్సీ, మైనారిటీ గురుకులాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు.

ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరిగేలా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మరిన్ని విజయాలు సాధించేలా తీర్చిద్దాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను, అధ్యాపకులను ఆదేశించారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది అందరికీ టీకా వేయించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, విద్యాలయాల పరిసరాలు, తరగతి, హాస్టల్ గదులు, కిచెన్, బాత్రూంలు పరి శుభ్రంగా ఉండేట్లు చూడాలని కోరారు.

అవసరమైన మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని, తరగతి,హాస్టల్ గదుల్లో గాలి,వెలుతురు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అడ్మిషన్లు పూర్తి చేయాలని, పాఠ్య, నోట్ పుస్తకాలు, బెడ్ షీట్లు, దుస్తులు సకాలంలో అందించాలన్నారు. విద్యార్థులను పొద్దటి పూట 20నిమిషాల పాటు ఎండలో ఉంచాలని, రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు వాము వాటర్ లో పచ్చి పసుపు కలిపి అందించాలని సూచించారు.

డైట్ ధరల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బాలుర డ్రాపౌట్స్ తగ్గించేందుకు డిగ్రీ కాలేజీలు ప్రారంభించాల్సి అవసరం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, స్థలం, సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట విద్యార్థుల కోసం కోళ్లు,గొర్లు, కూరగాయలు పెంచాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బందికి అవగాహన పెంపొందించాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సమావేశంలో మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకేఖాన్, ప్రభుత్వ కార్యదర్శులు రాహూల్ బొజ్జ, అహ్మద్ నదీమ్, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మైనారిటీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి షఫీఉల్లా, ఉన్నత విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed