రేషన్ డీలర్ల భారీ మోసం.. కలెక్టర్ సీరియస్

by  |
రేషన్ డీలర్ల భారీ మోసం.. కలెక్టర్ సీరియస్
X

దిశ, బాన్సువాడ: మహబూబాబాద్ జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారుల రేషన్ బియ్యాన్ని బీర్కూర్ డీలర్లు కాజేసిన డొంక కదిలింది. పేదల బియ్యం మెక్కుతున్న డీలర్ల గుట్టు రట్టయింది. విషయం తెలిసిన కలెక్టర్ అధికారులపై సీరియస్ అయి, చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాళ్లోకి వెళితే… కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రేషన్ డీలర్లు, మహబూబాబాద్ జిల్లాలోని 173 మంది ఆహార భద్రత కార్డుదారులు పేరుతో గత మూడునెలలుగా రేషన్ బియ్యాన్ని కాజేస్తున్నారు. ఈ వ్యవహారం ఆదివారం వెలుగులోకి వచ్చింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ గణేష్, ఆర్ఐ శ్రీనివాస్ ఆదివారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం డీలర్లను విచారించగా, అసలు నిజాలు బయటపడ్డాయి. అధికారుల వివరాల ప్రకారం… మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, బయ్యారం, కేసముద్రం,పెద్ద వంగం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 173 మంది లబ్దిదారుల కార్డుల పేరుతో అక్రమంగా దోచుకున్నారని స్పష్టం చేశారు.

బీర్కూరు మండలంలోని తిమ్మాపూర్, బీర్కూర్, దామరంచ గ్రామానికి చెందిన డీలర్లు నర్సింహులు, నాగరాజు, రాజులు మహబూబాబాద్ జిల్లా డీలర్లతో కుమ్మకై పోర్టబులిటీ కింద లబ్ధిదారుల పేర్లపై మూడు నెలలుగా బియ్యాన్ని కాజేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల మూడు రేషన్ దుకాణాల నుంచి 60 క్వింటాళ్లవరకూ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకునేవారని వెల్లడించారు. చేసిన మోసాన్ని డీలర్లు ఒప్పుకోవడంతో పాటు, వీరికి సహకరించిన వీఆర్వోలు, లింగం, గంగాధర్, రవిలతో పాటు ముగ్గురు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Next Story