ఈవీ మార్కెట్ లక్ష్యం రూ. 3.5 లక్షల కోట్లు

by  |
ఈవీ మార్కెట్ లక్ష్యం రూ. 3.5 లక్షల కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం 2030 నాటికి దేశంలోని రోడ్లపై తిరిగే మొత్తం వాహనాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒరిజినల్ పరికరాల తయారీదారు (ఓఈఎమ్)లకు రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో సుమారు రూ. 3.5 లక్షల భారీ మూలధన వ్యయం అవసరమవుతుందని ఓ నివేదిక స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వ్యాపార వాతావరణం తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఓఈఎమ్‌లు ఈ స్థాయి మూలధన వ్యయాన్ని(క్యాపెక్స్) భరించే పరిస్థితి లేదని వెల్లడించింది.

కొత్త మోడల్ లాంచ్‌ల సామర్థ్యం పెంచేందుకు, ఇప్పటికే ఉన్న మోడళ్ల అప్‌గ్రేడ్‌ల కోసం ఓఈఎమ్‌లు ప్రస్తుత సంవత్సరానికి సుమారు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల కోట్ల మూలధన వ్యయాన్ని కలిగి ఉన్నాయని బ్రిక్‌వర్క్స్ అనలిటిక్స్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇటీవల ఆటోరంగం లాక్‌డౌన్ అంతరాయాల నుంచి బయటపడ్డాక క్రమంగా రికవరీ సంకేతాలను చూపిస్తోంది. పైగా పండుగ సీజన్ కావడంతో డిమాండ్ ఎక్కువగా పెరిగిందని నివేదిక పేర్కొంది. ధర, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వంటి పలు అంశాలతో పాటు ఈవీల కోసం తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం ఈవీ మార్కెట్‌కు ముఖ్యమని నివేదిక పేర్కొంది.

పెరుగుతున్న కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతిపాదిత ఈవీ వ్యాపారాల పరిధిని విస్తృతం చేసేందుకు ఆటో తయారీ కంపెనీలు ఇప్పటికే తమ మూలధన వ్యయాన్ని పెంచాయి. అయితే, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కంపెనీలు మూలధన వ్యయం పట్ల పునరాలోచనలకు దారి తీయనున్నట్టు నివేదిక అభిప్రాయపడింది. ఇదివరకే జరిగిన నష్టాలను భర్తీ చేసే క్రమంలో వ్యయాన్ని ఏ మేరకు పెంచుతాయనేది చూడాలని నివేదిక పేర్కొంది.


Next Story

Most Viewed