ఇది చెరువు కాదు.. జనాలు ఉంటోన్న కాలనీ

by  |
floods in colonies
X

దిశ, ఖమ్మం రూరల్: రియల్ ఎస్టేట్ మూలంగా రూరల్ మండలంలోని ఏదులాపురం, పెద్దతండా పంచాయతీలు అభివృద్ధి చెందాయి. గతంలో ఇక్కడ ఎవరు డీటీసీపీ లేఅవుట్ వేయకపోవడంతో పాటు రెండు గ్రామాల మధ్య ఉన్న వాగు అక్రమణకు గురైంది. దీంతో వెంచర్‌లో నిర్మించిన ఇండ్లు ప్రస్తుతం జలమయం అయ్యాయి. వర్షపు నీటితో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. విషయాన్ని అధికారులకు తెలియజేయడం వారు వచ్చి పరిశీలించడం పరిపాటిగా మారింది కానీ, పరిష్కారం చూపకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

floods in colonies

ఏదులాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో చెరువు ఉంది. ఆ చెరువు కింద ఉన్నటువంటి భూముల్లో రియల్ ఏస్టేట్ వ్యాపారులు వెంచర్‌లు వేశారు. చెరువు అలుగుతో పాటు చిల్ల కాలువలు కూడా ఉన్నాయి. కాలువలతో చెరువు కింద భూమి దాదాపు 300 ఎకరాలకు పైగా సాగులో ఉండేది. అయితే, ప్రస్తుతం అక్కడ 30 ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. రియల్ ఏస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి, చుట్టూ ఉన్న భూములను ఆక్రమించుకొని విచ్చలవిడిగా అధికారుల అనుమతి లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేశారు. 40 అడుగుల వాగును 15 అడుగులకు కుదించి, అక్రమించి, నిర్మాణం చేపట్టారు. మరికొన్ని చోట్ల 15 అడుగులలోపే వాగు స్థలం మిగిల్చారు. గ్రామ పాలకవర్గం అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడంతో ఇష్టానుసారంగా వెంచర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడ కొందరు స్థలం కొనుక్కొని ఇళ్ల నిర్మించుకున్నారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండటంతో ఇళ్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వరదనీటిలో దోమలు వృద్ధి చెంది వైరల్ ఫీవర్‌లకు కారణం అవుతోంది.

floods in colonies

అంతేగాకుండా.. ఏదులాపురం చెరువు నుంచి మున్నేటి వరకు సుమారు 15 కిలో మీటర్ల మేర వరదనీరు ప్రవహిస్తోంది. ఈ మార్గంలో చుట్టూ ఇరు వైపుల వెంచర్‌లు నిర్మించారు. దీంతో వాగు ఆక్రమణకు గురైంది. దీనిపై దీనికి ఇరిగేషన్, పంచాయతీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు గుర్తించి అక్రమణకు గురైన వాగును వెలికితీయాలని, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని, లేకపోతే రాబోవు రోజుల్లో ఈ సమస్య ఇంకా మరింత పెరగనుందని అన్నారు.

అధికారుల తీరుపై ఆగ్రహం

వరద వచ్చినప్పుడల్లా అధికారులు హడావుడిగా వచ్చి, అది చేస్తాం.. ఇది చేస్తాం చెప్తారే తప్పా చేసేదేం లేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యమే నేడు ఈ పరిస్థితి కారణం అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ముప్పు నుంచి తమను కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. అంతేగాకుండా.. స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వేడుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం : శ్రీనివాసరావు, ఎంపీడీవో

ఏదులాపురం చెరువు కింద వెంచర్‌లో వరదనీటి సమస్య ఉన్నమాట వాస్తవమే. ఇప్పటికే పలుమార్లు సందర్శించాము. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ అధికారులు సర్వే చేసి సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నం చేస్తున్నాం. విషయాన్ని పై అధికారులకు సైతం తెలియజేశాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

కాలనీలో ఉండలేకపోతున్నాం : మోహన్ రావు, కాలనీవాసీ

కాలనీలోకి భారీగా వరదనీరు చేరడం మూలంగా దోమలు, వాసనకు ఇక్కడ ఉండలేకపోతున్నాం. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టింపులేదు. వరదనీటిలోనే సావాసం చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించకపోతే కాలనీవాసుల ఐక్యతతో ధర్నాలు నిర్వహించాలని ప్లాన్​చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమణకు గురైన వాగును వెలికితీసి వరదనీటి నుంచి మమ్మల్ని రక్షించాలని వేడుకుంటున్నాం.


Next Story

Most Viewed