illegal Occupy Ponds : భారీగా చెరువులు కబ్జా.. మొద్దునిద్ర వీడని అధికారులు

by  |
Palakaveedu pounds
X

దిశ, నేరేడుచర్ల: భూములకు రేట్లు పెరగడంతో కబ్జాలు చేసేందుకు అక్రమార్కులు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు రోజూ ఎక్కడో ఒకచోట కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. కానీ, రెవెన్యూ అధికారులు మాత్రం ఫిర్యాదు చేసినా పట్టించుకునే స్థితిలో లేరు. నామమాత్రంగా కబ్జా జరిగిన స్థలాన్ని పరిశీలించి, వెళ్లామా? వచ్చామా? అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారుల మౌనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాలకవీడు మండలంలో దాదాపు 41 చెరువులు, కుంటలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయి. మిషన్ భగీరథ కాకతీయ పనులు చేసేందుకు 22 చెరువులకు, కుంటలకు ఐబీ అధికారులు జీపీఎస్ ద్వారా గుర్తించారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పలు చేయడానికి నిధులు సైతం మంజూరు చేయించారు. తీరా పనులు చేసేందుకు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి చూస్తే కనీసం ఆనవాళ్లు కూడా లేకపోవడం గమనార్హం. దీంతో పనుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు అలాగే మిగిలి ఉన్నాయి.

మండలంలోని గుడుగుంట్ల పాలెం గ్రామంలో కూడా ఏడు చెరువులు, కుంటలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా చెరువులు, కుంటలు ఉన్నట్లు ఆనవాళ్లు కూడా లేవు. సర్వే నెంబర్ 207లో 13 ఎకరాల 25 కుంటల విస్తీర్ణంలో దాసరికుంట చెరువు ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. ప్రస్తుతం ఆ చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడ చెరువు ఉంది అని చెప్పుకోవడానికి కేవలం చెరువు కట్ట మాత్రమే మిగిలి ఉంది. గత బుధవారం కొందరు వ్యక్తులు ఆ కట్టకు ఉన్న మట్టిని జేసీబీ సహాయంతో పంట పొలాల్లో పోసుకుంటున్నారు.విషయాన్ని గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆర్డీవో దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. ఈ చెరువు మరమ్మతులకై మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.48 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. ఇప్పటికైనా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందించి, కబ్జాకు గురైన చెరువులను, కుంటలను సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వచ్చిన నిధులతో వాటికి మరమ్మతులు చేయించుకుంటే భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడతాయని ప్రజలు కోరుకుంటున్నారు. మరి కబ్జాకు గురైన చెరువులు, కుంటలపై అధికారులను ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

కబ్జాకు గురైన చెరువులు కుంటలను గుర్తించాలి : సురేష్

కబ్జాకు గురైన చెరువులు, కుంటలను ప్రభుత్వం గుర్తించి వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని స్థానికులు సురేష్ అధికారులను డిమాండ్ చేస్తున్నాడు. చెరువుల మరమ్మతుల కోసం ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. కబ్జాకు గురైన స్థలాలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గుర్తించి హద్దులు గుర్తించి, మరమ్మతులు చేయించాలని అన్నారు. చెరువు, కుంటల్లో నీరు నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు పెరగుతాయి. భవిష్యత్తులో తరాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

హద్దులు ఏర్పాటు చేస్తాం : ఎమ్మార్వో రవికిరణ్

గతంలో పాలకవీడు మండలంలో పలు గ్రామాల్లో చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి. వాటిని గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తాం. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో వివరణ ఇచ్చారు.


Next Story

Most Viewed