నల్లగొండలో శ్మశాన స్థలాల కోసం కొట్లాట

by  |
నల్లగొండలో శ్మశాన స్థలాల కోసం కొట్లాట
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: గ్రామీణ ప్రజల ఆరోగ్యం.. ఆహ్లాదం కోసం ఏర్పాటు చేయనున్న ఊరికో ఉద్యానవనానికి ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాల కొరత వేధిస్తోంది. పల్లెల్లో ప్రభుత్వ భూములు లేకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి అవరోధం ఏర్పడుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగం పంచాయతీల్లోనే ప్రభుత్వ స్థలాలు ఉండగా.. అనేక గ్రామాల్లో లేకుండాపోయాయి. ఇప్పటికే స్థలాలు ఉన్న వాటిలో గుర్తించిన అధికార యంత్రాంగం.. లేని చోట్ల వీటి ఏర్పాటుపై తర్జనభర్జన పడుతున్నారు. ప్రైవేటు భూములు కొనుగోలు చేయడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. వీటి నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పంచాయతీల్లో స్థలాలను సేకరించాలని ఇటు సర్పంచ్‌లు.. అటు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వారు సైతం శ్మశాన వాటికలు, గ్రామ శివారుల్లోని అసైన్డ్ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో భూతగాదాలు పెరిగిపోతున్నాయి.

సగం పంచాయతీలకు పైగా..

పట్టణ ప్రాంతాల లాగే పల్లెల్లోనూ ప్రజల సౌకర్యార్థం ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరికో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకు ఆయా పంచాయతీల్లో ఎకరం స్థలం గుర్తించి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించింది. వివిధ రకాల మొక్కలతో పాటు నడకదారి, యోగా, వ్యాయామం చేసేలా వసతులు కల్పించాలని సంకల్పించింది. త్వరగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద పల్లెల్లో స్థలాల పరిశీలన చేపట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగం పంచాయతీల్లోనే ప్రభుత్వ స్థలాలు ఉండగా.. అనేక గ్రామాల్లో లేకుండాపోయాయి. సగం గ్రామాల్లో స్థలాలను గుర్తించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ఉపాధి నిధులను వినియోగించుకోనున్నారు. మొక్కల పెంపకంతోపాటు లోపల వివిధ మౌలిక వసతులు కల్పించేందుకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. స్థానికంగా రెవెన్యూ సిబ్బంది స్థలాలను సేకరించి పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాల్సి ఉంటుంది. స్థల మార్పిడి పూర్తయిన తర్వాత గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ ద్వారా వీటిని ఏర్పాటుచేయనున్నారు. స్థలాలు లభించిన చోట్ల పనులు ప్రారంభించారు.

స్థలాలు లేక సందిగ్ధం..

పట్టణంలోనే కాకుండా పంచాయతీల్లోనూ స్థలాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం కోసం సేకరించిన సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొన్ని చోట్ల పంచాయతీ నిధులు వెచ్చించి కొనుగోలు చేయగా.. మరికొన్ని చోట్ల దాతల సాయంతో సేకరించారు. మరికొన్ని చోట్ల ఊరికి దగ్గరగా ఉన్న స్థలాలు కబ్జాలకు గురైన సందర్భాలున్నాయి. దీంతో పల్లెల్లోనూ ప్రభుత్వ భూములు లభించడం గగనంగా మారింది. తాజాగా ప్రభుత్వం ఉద్దేశం బాగున్నా.. స్థలాలు లేకపోవడంతో అనేక గ్రామాల్లో వీటి ఏర్పాటు కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ప్రైవేటు స్థలాలు ఉన్నప్పటికీ.. డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఇందుకు నిధులు కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు. నల్లగొండ జిల్లాలో సగానికి పైగా పంచాయతీల్లో ఈ సమస్య తలెత్తగా.. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ ఇంచుమించు ఇదే మాదిరిగా మారింది.

అసైన్డ్ భూములతో తగాదాలు..

ప్రకృతివనం కోసం సేకరించి భూములు రోజురోజూకీ వివాదస్పదంగా మారుతున్నాయి. గతంలో ప్రభుత్వాలు.. పేదలకు ఇళ్లస్థలాలు, పంటల సాగు కోసం కేటాయించిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడా భూమి లభించని గ్రామపంచాయతీల్లో ఇప్పటికే అసైన్డ్ భూములను లాక్కుంటుండడంతో తగాదాలు పెరిగిపోతున్నాయి. సూర్యాపేట జిల్లాలోనైతే ఏకంగా తమ భూమిని లాక్కున్నారని బాధితులు ఆత్మహత్యయత్నం చేసిన ఘటనలు ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లో శ్మశాన వాటిక కోసం సేకరించిన భూములను ప్రకృతి వనం కోసం ఆక్రమించేశారు. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వనం కోసం సేకరించిన భూములు వివాదస్పదంగా మారాయి. గ్రామస్తుల నుంచి వ్యతిరేకతతో సర్పంచ్‌లు, అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే చెప్పాలి.

Next Story

Most Viewed