రెండున్నర రోజుల్లో లక్ష కరోనా కేసులు

by  |
రెండున్నర రోజుల్లో లక్ష కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసులు కేవలం ఇరవై రోజుల్లోనే రెట్టింపైంది. ప్రతీరోజు సగటున 35వేలకు పైగానే కేసులు నమోదవుతుండడంతో రెండున్నర రోజుల వ్యవధిలోనే లక్ష కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 12లక్షలు దాటింది. ఈ నెల 2వ తేదీ నాటికి 6.04 లక్షల కేసులు ఉంటే ఇప్పుడు అది 12.24 లక్షలు దాటింది. ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 29 వేలు దాటింది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఉదయం అధికారికంగా బులెటిన్ వెలువరించే సమయానికి మొత్తం కేసుల సంఖ్య 11.92 లక్షలు, మొత్తం మృతుల సంఖ్య 28,732గా ఉంది.

కానీ సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ (6,045), తమిళనాడు (5,849), కర్నాటక (4,764), మహారాష్ట్ర (10,576), పశ్చిమబెంగాల్ (2,291), తెలంగాణ ( 1,554), బీహార్ (1,502), ఢిల్లీ (1,227), గుజరాత్ (1,020) చొప్పున మొత్తం 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిని కూడా కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 12. 24 లక్షలు దాటింది. మొదటి లక్ష కేసులు నమోదు కావడానికి 118 రోజులు (జనవరి 30 నుంచి మే 18 వరకు) పడితే ఇప్పుడు అది రెండున్నర రోజుల్లోనే అంత సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి.

వైరస్ వ్యాప్తి విషయంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల నివారణా చర్యలు ఫలితాలు ఇవ్వడంలేదు. ఆంద్రప్రదేశ్‌లో రెండంకెల స్థాయిలో నమోదవుతున్న కేసులు నెల రోజుల్లోనే ఇప్పుడు సగటున ఐదారు వేల కొత్త కేసుల చొప్పున నమోదయ్యే స్థాయికి చేరుకుంది. తెలంగాణలో సైతం ప్రతీరోజు సగటున 1500కు పైగానే కేసులు పుట్టుకొస్తున్నాయి. ఢిల్లీలో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా దక్షిణాది రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక) మాత్రం కంట్రోల్‌లో లేదు. టెస్టుల సంఖ్య పెరుగుతున్నాకొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.



Next Story

Most Viewed