నేడే నింగిలోకి ‘విక్రమ్-1’.. హైదరాబాద్ ‘స్కైరూట్’ ఆర్బిటాల్ రాకెట్ లాంచ్‌కు రెడీ

by I. Sairam |

హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు అంతరిక్షంలోకి వెళ్లనుంది.

నేడే నింగిలోకి ‘విక్రమ్-1’.. హైదరాబాద్ ‘స్కైరూట్’ ఆర్బిటాల్ రాకెట్ లాంచ్‌కు రెడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ-షార్) లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 11:30 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.

స్వదేశీ పూర్తి స్థాయి ఆర్భిటాల్ రాకెట్

స్కైరూట్ ఏరోస్పేస్ స్వదేశీంగా తయారు చేసిన పూర్తి స్థాయి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ అంతరిక్ష ప్రయోగాల్లో చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే భారత గడ్డ పైనుంచి ఒక ప్రైవేట్ కంపెనీ పూర్తి స్థాయి ఆర్బిటల్ రాకెట్‌ను (ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి చేర్చే రాకెట్) ప్రయోగిస్తుండటం ఇదే మొదటిసారి. ఇది సుమారు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలో మీటర్ల ఎత్తులోని లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరవేయగలదు. ఈ ఈ మిషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పంపిన ఒక ప్రత్యేక సందేశాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు. కాగా.. హైదరాబాద్ స్టార్టప్ 'కాస్మోసర్వ్ స్పేస్' తయారు చేసిన స్పేస్ జంక్‌ను తొలగించే ‘మిషన్ ఎంబ్రేస్’ రోబోటిక్ ఆర్మ్ పేలోడ్‌ను కూడా ఇది మోసుకెళ్లనుంది. ఇందులో కొన్ని విదేశీ ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లనుంది.

శాస్త్రవేత్తలకు గౌరవంగా మైక్రో ఆర్ట్స్

ప్రఖ్యాత మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టివాడ రూపొందించిన 18 క్యారెట్ల బంగారు మైక్రో రాకెట్ కూడా ఇందులో అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ చిన్న రాకెట్‌లో భారతీయ శాస్త్రవేత్తలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సివి రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం‌ల మైక్రో ఆర్ట్‌లను ఉంచి గౌరవంగా పంపుతున్నారు. ఇందులో మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు చేతితో రాసిన పోస్ట్‌కార్డులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు.

‘మిషన్ ఓ2’ ప్రకటించిన అగ్నికుల్ కాస్మోస్

చైన్నైకు చెందిన మరో అంతరిక్ష స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ కూడా అంతరిక్ష రంగంలో అద్భుతం చేయనుంది. తమ ‘మిషన్-ఓ2’ ద్వారా భారతదేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ ఆర్బిటల్-క్లాస్ రాకెట్ బూస్టర్‌ను సురక్షితంగా భూమికి (సముద్రంలోకి) దించి, దానిని రికవరీ చేసే భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ మిషన్ మరో ప్రత్యేకత ఏంటంటే ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత రాకెట్ పైభాగం స్పేస్ జంక్‌గా మారిపోకుండా, అక్కడే ఒక పని చేసే లైవ్ ప్లాట్‌ఫారమ్‌గా మారి ప్రయోగాలకు ఉపయోగపడుతుంది. కాగా... ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నేపథ్యంలో అగ్నికుల్ కాస్మోస్ సంస్థ తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్‌ను అబ్జర్వర్‌గా చేర్చుకుంది.

Next Story