త్వరలోనే ఇరాన్‌కు 6 బిలియన్ డాలర్లు : అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్

by I. Sairam |

ఖతార్‌లో నిలిచిపోయిన 6 బిలియన్ డాలర్ల నిధులు త్వరలోనే ఇరాన్ కు విడుదల కానున్నాయని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు.

త్వరలోనే ఇరాన్‌కు 6 బిలియన్ డాలర్లు : అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఖతార్‌లో నిలిచిపోయిన 6 బిలియన్ డాలర్ల నిధులు త్వరలోనే ఇరాన్‌కు రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సోమవారం ప్రకటించారు. గత వారాంతంలో పర్షియన్ ఖల్ఫ్ ప్రాంతంలో జరిగిన దాడుల కారణంగా అమెరికాతో జరుగుతున్న చర్చలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిన తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇరాన్ మతస్వామ్య రాజకీయ వ్యవస్థలో సంస్కరణవాదిగా ఉన్న పెజెష్కియాన్.. ఖతార్‌లో నిలిచిపోయిన నిధుల విడుదల గురించి బహిరంగంగా ప్రస్తావించిన అత్యున్నత స్థాయి ఇరాన్ అధికారిక ప్రతినిధి కావడం విశేషం. కాగా.. ప్రస్తుతానికి ఇరాన్ కు చెందిన ఎలాంటి నిధులను విడుదల చేయలేదని అమెరికా అధికారులు చెప్తున్నారు. అటు ఖతార్ కూడా ఈ నిధుల బదిలీని అధికారంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నిలిపివేసిన నిధులు అమెరికాతో గతంలో జరిగిన ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా సౌత్ కొరియా నుండి ఖతార్ బ్యాంకులకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అయితే ఒక వేళ ఖతార్ ఈ నిధులను విడుదల చేసినా.. వాటిని కేవలం ఆహారం, మెడిసిన్ వంటి మానవతా అవసరాల కోసమే ఇరాన్ వాడుకోవాలనే కండీషన్ ఉంది.

Next Story