బీజేపీలో చేరాక ఈటల ఆత్మగౌరవం పెరిగిందా.. తగ్గిందా..?

by  |
anil-kurama 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : తన స్వార్థం కోసం, ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల బీజేపీలో చేరారని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరొచ్చని.. నాయకుల మెప్పు కోసం రాజకీయ జీవితమిచ్చిన టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను మాజీమంత్రి ఈటల విమర్శించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈటల మాటలను హుజురాబాద్‌తో పాటు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సరైన సమయంలో ఈటలకు తగిన బుద్ది చెబుతారని విమర్శించారు.

కరోనా సమయంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని ప్రజలు కోరుతుంటే, ఈటలకు గొప్పగా కనబడటం విచిత్రంగా ఉందన్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు.. ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరడంతో ఈటల నిజస్వరూపం ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను ఆత్మవిమర్శ చేసుకోమనడం కాదని.. ఢిల్లీకి పోయి వచ్చాక ఆత్మవిమర్శచేసుకుని ఆత్మగౌరవం పెరిగిందా? తగ్గిందా? చూసుకోవాలని ఈటలను ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన టీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శిస్తే సరైన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఎన్నారై శాఖ నుంచి గ్రామ కార్యకర్త వరకు హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని, ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు.


Next Story