ఎన్‌పీఎస్‌లో చేరే గరిష్ఠ వయసును పెంచేందుకు పీఎఫ్ఆర్‌డీఏ ప్రతిపాదన!

by  |
ఎన్‌పీఎస్‌లో చేరే గరిష్ఠ వయసును పెంచేందుకు పీఎఫ్ఆర్‌డీఏ ప్రతిపాదన!
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్)లోకి ఇప్పటివరకు చేరని సీనియర్ సిటిజన్లకు ఊరట. ప్రస్తుతం ఎన్‌పీఎస్ ప్రయోజనాలను పొందడానికి నిర్దేశించిన 65 ఏళ్ల వయసును గరిష్టంగా 70 ఏళ్లకు పెంచాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్‌డీఏ) యోచిస్తోంది. అదే సమయంలో ఎన్‌పీఎస్ పథకం నుంచి నిష్క్రమించడానికి 70 ఏళ్ల నుంచి 75 ఏళ్లకు పెంచడానికి ప్రతిపాదనలు పంపించినట్టు పీఎఫ్ఆర్‌డీఏ ఛైర్మన్ సుప్రతీమ్ బంద్యోపాధ్యాయ్ చెప్పారు. అలాగే, 60 ఏళ్ల తర్వాత ఈ పథకంలో చేరిన వారికి 75 ఏళ్ల వరకు ఎన్‌పీఎస్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని రెగ్యులేటరీ ప్రతిపాదించింది.

ప్రస్తుతం ఎన్‌పీఎస్ ఖాతా తెరిచేందుకు 18-65 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. అయితే, 60 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించేవారు ఇటీవల పెరిగారని, గడిచిన మూడేళ్లలో కొత్తగా 15 వేల మంది వరకూ ఎన్‌పీఎస్‌లో చేరారని సుప్రతీమ్ బంద్యోపాధ్యాయ్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్‌పీఎస్ నిర్వహణలోని ఆస్తులు 2020-21లో 38 శాతం వృద్ధి నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. కొత్తగా 60 లక్షల మంది ఎన్‌పీఎస్ చందాదారులు చేరారని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed