ఆ 25 మంది అభ్యర్థుల కంటే నోటాకే అధికం

by  |
Nota
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు అనంతరం 18వేల పైచిలుకు ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తన సమీప ప్రత్యర్థి కుందూరు జానారెడ్డిపై గెలుపొందారు. అయితే ఈ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇందులో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకు కలిపి 1,60,736 ఓట్లు వచ్చాయి. మిగిలిన 39 మంది అభ్యర్థులకు 29,626 ఓట్లు మాత్రమే రాగా, నోటాకు 499 ఓట్లు వచ్చాయి. ఈ 39 మంది అభ్యర్థుల్లో బీజేపీతో పాటు టీడీపీ అభ్యర్థి ఉండడం గమనార్హం. అయితే బీజేపీ అభ్యర్థి 7676 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 1714 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో పది మంది అభ్యర్థులకు 500పైగా ఓట్లు వచ్చాయి. కానీ 25 మంది అభ్యర్థులకు కేవలం నోటాకు వచ్చిన ఓట్లు(499 ఓట్లు)ను సైతం వీరు సాధించలేకపోవడం గమనార్హం.

ఇందులోనూ డబుల్ డిజిట్‌కు 9 మంది అభ్యర్థులు పరిమితమయ్యారు. ఇదిలావుంటే.. రెండు పర్యాయాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, మరో పర్యాయం ఏపీని ఏలిన టీడీపీ పార్టీ అభ్యర్థి మువ్వా అరుణ్ కుమార్ 1714 ఓట్ల కంటే.. ఇండిపెండెంట్ అభ్యర్థి తలారి రాంబాబు 2980 ఓట్లు సాధించడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం.

నోటాకు వచ్చిన ఓట్లను సాధించలేకపోయింది వీరే..

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కనీసం నోటాకు వచ్చిన ఓట్లను కూడా 25 మంది అభ్యర్థులు సాధించలేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వారి జాబితాను ఒక్కసారి చూస్తే.. కందెల శంకరయ్య-217, నూర్జహాన్ బేగమ్-275, పొదిల వెంకటరమణ-206, వడ్లపల్లి రామక్రిష్ణారెడ్డి-278, అందె రవికుమార్-433, కోటిబాబు కందూరి-227, కంటే శ్యామ్-243, గౌతి మల్లేశ్-94, గుండె రమేశ్ చంద్ర-178, చిట్టిప్రోలు సురేంద్ర-98, చంతమళ్ల సైదమ్మ-59, జనగాం పాండుగౌడ్-58, తగుళ్ల నరేశ్-107, పానుగోతు లలన్ సింగ్-73, పిడమర్తి రవీంద్ర-379, పొలిశెట్టి వెంకటేశ్వర్లు -127, మర్రి నేహమయ్య-295, ఆర్ఎల్ రావు-158, లొగ్గరి రమేశ్-300, విక్రమ్ రెడ్డి వేముల-51, వంగూరి మహేందర్ బాబు-59, శ్రీకాంత్ సిలివేరు-55, ఎస్‌కే నహీమ్ పాష-34, సపావట్ సుమన్-135, సీహెచ్.సైదయ్య-223 ఓట్లతో ఈ జాబితాలో స్థానం సంపాదించారు.


Next Story