ధరణిలో వ్యవసాయేతర ఆస్తులు

by  |
ధరణిలో వ్యవసాయేతర ఆస్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ధరణి’ పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది, అధికారులు ప్రాక్టీస్ చేశారు. బీఆర్కే భవన్‌లోని వార్ రూం నుంచి ధరణి పోర్టల్ పార్టు 2 లింకును పంపించారు. ఒక్కో కార్యాలయంలో నాలుగైదు సేల్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ చేశారు. సాగు భూముల క్రయ విక్రయాల మాదిరిగానే ఈజీగానే ఉందని అధికారులు చెబుతున్నారు. డాక్యుమెంట్ల ఆటో జనరేషన్ ప్రక్రియను నిర్వహించారు. అమ్మేవాళ్లు, కొనేవాళ్ల వివరాలు, ఆస్తికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. వెంటనే ఆటోమెటిక్‌గా మార్కెట్ వ్యాల్యూ జనరేట్ అవుతుంది. అయితే మార్కెట్ వ్యాల్యూను కొనుగోలు చేసే వ్యక్తి పెంచుకునే వెసులుబాటు ఉంది. పెంచిన రేటుకు అనుగుణంగానే స్టాంపు డ్యూటీ చెల్లించాలి. అది కూడా ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు. లేదంటే బ్యాంకులో చెల్లిస్తే దాని వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇందులో అమ్మే వ్యక్తి సదరు ప్రాపర్టీ తన సొంతానిదేనని, ఎలాంటి వివాదాలు లేవని, ప్రభుత్వ స్థలం కాదని అఫిడవిట్ సమర్పించాలి. మ్యుటేషన్ ఫీజు కూడా ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతుంది.

అనుమానాలు అలాగే..

ప్రస్తుతానికి ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన ఆస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలకే పరిమితమైంది. ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ నెంబరు ద్వారా నమోదు చేసిన ప్రాపర్టీస్‌కు మాత్రమే పరిమితమయ్యారు. ఓపెన్ ప్లాట్ల వివరాలను ధరణిలో నమోదు చేస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తారా? లేదా? గతంలో మాదిరిగానే డాక్యుమెంట్ల ఆధారంగా చేస్తారా? అనే అనుమానాలు యథాతథంగా ఉన్నాయి. ప్రభుత్వం అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లపై రిజిస్ట్రేషన్లు నిషేధించారు. కనీసం అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్లనైనా రిజిస్ట్రేషన్లు చేసే వీలుంది. కానీ వాటికి కూడా ఇంకా ధరణిలో చోటు లభించలేదు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేయాలంటూ ఏకంగా 29 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిపై ప్రభుత్వం పరిశీలన కూడా మొదలు పెట్టలేదు. జనం మాత్రం ఎప్పుడెప్పుడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలు పెడతారోనని ఎదురుచూస్తున్నారు.

అయితే ఎల్ఆర్ఎస్‌తో సంబంధం లేకుండానే క్రయ విక్రయాలు నిర్వహించాలంటూ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న లక్షల మందికి ఎంత కాలంలో ఎల్ఆర్ఎస్ ప్రొసిడింగ్స్ ఇస్తారో చెప్పాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ కోరారు. ఇండస్ట్రీయల్ జోన్‌లో ఉన్న ప్లాట్స్ రిజిస్టర్ చేస్తారా? ధరణిలో నమోదు కాని, కనిపించని ఆస్తులు రిజిస్టర్ అవుతాయా? అని ప్రశ్నించారు. చిన్న కారణాలతో కోర్టు కేసులు ఉన్న లేఅవుట్లలోని ప్లాట్స్ రిజిస్టర్ చేయకపోతే ప్రజలు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలన్నీ ఎన్ని సంవత్సరాల్లో తీరుతాయని, ఇప్పటికీ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారి సంగతేమిటనే పలు సందేహాలను ఆయన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed