కేకే, సురేష్‌రెడ్డి నామినేషన్ల దాఖలు

by  |
కేకే, సురేష్‌రెడ్డి నామినేషన్ల దాఖలు
X

టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా కె. కేశవరావు, సురేష్‌రెడ్డి శుక్రవారం నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటికే శ్రమజీవి తరఫున రెండు సెట్ల నామినేషన్లు దాఖలుకాగా ఇప్పుడు వీరిద్దరి తరఫున తలా రెండు సెట్ల చొప్పున నాలుగు దాఖలయ్యాయి. దీంతో మొత్తం ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారమే చివరిరోజు కావడంతో మధ్యాహ్నం 12.50 గంటలకు వీరిద్దరూ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. వీరి వెంట టీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు వెళ్ళి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

కేశవరావు, సురేష్‌రెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా ఎన్నిక కావడం కేవలం లాంఛనం మాత్రమే. వీరిద్దరూ గెలవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నందున వీరి గెలుపు దాదాపుగా ఖరారైపోయింది. శ్రమజీవి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేసే ఎమ్మెల్యేలు దాదాపుగా ఎవరూ లేరనే భావించవచ్చు. ఇప్పటివరకు దాఖలైన ఆరు నామినేషన్ పత్రాల పరిశీలన ఈ నెల 16వ తేదీన జరగనుంది. శ్రమజీవి పార్టీ తరఫున దాఖలైన నామినేషన్లపై పరిశీలన రోజున స్పష్టత రానుంది. అవి తిరస్కారానికి గురయినట్లయితే బరిలో కేశవరావు, సురేష్‌రెడ్డి మాత్రమే మిగులుతారు. దీంతో వీరిద్దరి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమే అయ్యే అవకాశాలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది. నామినేషన్ల పరిశీలన తర్వాత పోలింగ్ జరుగుతుందా లేదా అనే స్పష్టత వస్తుంది.

కేశవరావు, సురేష్‌రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించే సమయంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కూడా అక్కడే ఉన్నారు. అనంతరం లాబీలో మీడియాతో సంతోష్ చిట్‌చాట్ చేస్తూ… ”మా ముగ్గురి మధ్య ట్వంటీ ట్వంటీ ఫార్ములా ఉందన్నారు. వయసులో నాకంటే సురేష్‌రెడ్డి ఇరవై ఏళ్ళు పెద్దవారు. ఆయనకంటే కేశవరావు ఇరవై ఏళ్ళు పెద్దవారు..” అంటూ వ్యాఖ్యానించారు.

Tags: Telangana, Assembly, Rajyasabha, Gun Park, Keshava Rao, Suresh Reddy, nomination



Next Story

Most Viewed