పీఆర్సీపై క్లారిటీ ఏది..? వాళ్లకు అలా.. వీళ్లకు ఇలా..!

by  |
telangana-employees
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వేతన సవరణపై క్లారిటీ కరువైంది. ప్రభుత్వ శాఖల్లో పని చేసే 9.20 లక్షల మందికి 30 శాతం ఫిట్మెంట్​ఇస్తున్నట్లు సీఎం మార్చి 22న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వేతన సవరణ నెలల తరబడి సాగింది. ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులకు గత నెల నుంచి పెరిగిన వేతనాలు జమ అవుతున్నాయి. కానీ అదే 30 శాతం పెరిగిందని సంబురపడిన లక్షల మంది ఉద్యోగులకు మళ్లీ షాక్ తగిలింది. కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు పాత వేతనాలే జమ అయ్యాయి. పాత ఏరియర్స్​తో కలిపి పెరిగిన జీతం వస్తుందనుకున్న ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది.

ఎప్పడు ఇస్తారో..?

ఉద్యోగుల వేతనాల విషయంలో ప్రభుత్వ తీరు అధ్వానంగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రతినెలా వేతనాలను ఆలస్యం చేస్తూ చిన్న చిన్న పద్దులను సైతం వెనకేసుకుంటుందంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు గత నెల నుంచి వేతన పెంపు వర్తిస్తుండగా.. కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులకు ఈ నెల నుంచి పెరిగిన వేతనాలు అందుతాయని ఆశపడ్డారు. పీఆర్సీ నివేదికలో కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులకు కనీస వేతనం రూ.19 వేలుగా సూచించినా ప్రభుత్వం 30 శాతం ఫిట్​మెంట్‌నే అమలు చేసింది. దీంతో రూ. 12 వేలతో పని చేస్తున్న ఉద్యోగులకు రూ.15వేలకు చేరింది. ఇలా 30 శాతం ఫిట్​మెంట్‌తో సర్దుబాటు చేసినా.. మూడు నెలలు రాకుండా పోయాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్, మే నెలల్లో ఏరియర్స్​ఇస్తుండగా జూన్, జూలై పెంపును ఇటీవల ఏరియర్స్‌గా చెల్లించారు. అయితే కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులకు మాత్రం ఇంకా అమలు చేయలేదు. వాస్తవంగా గత నెలలో ప్రభుత్వం వీరి కోసం జీవో జారీ చేసింది. జూన్​ నెల నుంచి వేతన పెంపును అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దాని ప్రకారం పెరిగిన వేతనాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ నెలలో వేతనాలు పెరుగుతాయని భావించారు. కానీ ఇప్పుడిప్పుడే కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులకు వేతనాలను జమ చేస్తుండగా.. మళ్లీ పాత వేతనాలే విడుదల చేశారు. దీంతో ఈ నెల కూడా వారికి పీఆర్సీ అమలు కాలేదు. వచ్చేనెల పండుగల నేపథ్యంలో ఏరియర్స్‌తో సహా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed