బీజేపీ గెలుపును అడ్డుకోలేరు: కిషన్ రెడ్డి

by  |
బీజేపీ గెలుపును అడ్డుకోలేరు: కిషన్ రెడ్డి
X

దిశ, ముషీరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు అడ్డుపడ్డా… ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి పావని వినయ్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ శనివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న అప్పుడు ప్రభుత్వాన్ని అడిగే హక్కు అందరికీ ఉంటుందని, కేసీఆర్‌ను ప్రశ్నించే సమయం వచ్చిందని చెప్పారు. ఓటు అడిగేందుకు ఇంటికి ముందుకు వచ్చే టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వరదలు వచ్చి అనేకమంది సర్వం కోల్పోయారని, ప్రజలు ఇబ్బందులకు గురైతే ముఖ్యమంత్రి ఒక కుటుంబాన్ని కూడా పరామర్శించక పోవడం దారుణమన్నారు.

వరద సాయం పదివేలు ఇస్తామని చెప్పి… ఇవ్వకుండానే ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. నగరం రూపురేఖలు మారుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఆరేళ్లలో ఏం చేశారని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు. ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే నిజాయితీకి మారుపేరుగా గ్రేటర్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. తండ్రి కొడుకుల… అన్నదమ్ముల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. అమరుల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగిస్తామని చెప్పారు.

Next Story

Most Viewed