వామ్మో.. డోర్నకల్ కమిషనర్ పోస్టా..!

by  |
వామ్మో.. డోర్నకల్ కమిషనర్ పోస్టా..!
X

దిశ, డోర్నకల్: డోర్నకల్ మున్సి పల్ కమిషనర్‌గా కొత్త వారు రావాలంటేనే వామ్మో డోర్నకల్ మున్సిపల్ కమిషనర్ పోస్టా అని ఆందోళన పడుతున్నారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత తొలుత డోర్నకల్ మున్సిపాలిటీ కమిషనర్లు 6 గురు మారడంతో మున్సిపల్ ప్రజలు ఏం జరుగుతుందని డైలమాలో పడ్డారు. డోర్నకల్ మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఇన్‌చార్జి కమిషన‌ర్‌గా 2018 ఆగస్ట్ 2న బాధ్యతలు స్వీకరించారు. కేవలం నెల రోజులు మాత్రమే ఇన్‌చార్జిగా విధులు నిర్వహించి.. అనంతం తాను చేయలేనని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో జిల్లా ఆడిట్ అధికారి రాజుకు సెప్టెంబర్ 10న డిప్యుటేషన్‌పై కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆడిట్ అధికారి, ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత ఆయనపై అవినీతి ఆరోపణలతో సీడీఎంఏకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన పోస్ట్ మార్చారు.

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా రెగ్యులర్ కమిషనర్‌గా కె.శ్రీనివాస్‌ను నియమించారు. మంథని నుంచి ఆర్డర్‌పై వచ్చి, అయిష్టంతోనే బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన మెడికల్ లీవ్‌పై వెళ్లి తిరిగి రాకపోయే సరికి స్థానిక ఎంపీడీఓ కూర వెంకటేశ్వర్‌ను ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో మూడు నెలలు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన తర్వాత కరీంనగర్ నుంచి మల్లికార్జున స్వామిని రెగ్యులర్ కమిషనర్‌గా నియమించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు. జూన్ 3న ఆయన బాధ్యతలు స్వీకరించి రెండు నెలలకే (16 ఆగస్ట్)న మెడికల్ లీవ్‌పై వెళ్లిపోయారు. ఈ నెల 16న ఆయనను నారాయణపేట జిల్లా కోహ్లీ మున్సిపల్ ఆఫీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఖాళీగా ఉన్న మున్సిపల్ కమిషనర్ పోస్టుకు ఇతర అధికారులు ఇక్కడికి రావడానికి విముఖత చూపుతున్నారని తెలుస్తోంది.

Next Story