గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు

by  |
Vanasthalipuram-Hospital-1
X

దిశ, వనస్థలిపురం: తెలంగాణలో కొవిడ్ మూడో దశ వ‌చ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగల వేళ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాదులోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని సందర్శించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి100 పడకల ఐసీయూ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్‌ ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. క‌రోనా మూడో వేవ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా రాష్ట్రంలో ప‌డ‌క‌లు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఏరియా ఆసుప‌త్రిలో 100 ప‌డ‌క‌ల వార్డును ప్రారంభించటంతో మొత్తం 220 పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇక్కడి ప్రజలు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ కు వెళ్లకుండానే ఇక్కడే వైద్య సేవలు పొందవచ్చన్నారు. నిర్మాణ్ సంస్థ ద్వారా 12 ఐసీయూ పడకల వార్డు, ఇన్ఫోసిస్ సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేసినట్లు హరీశ్ వెల్లడించారు. ఏరియా ఆస్పత్రికొచ్చే వృద్ధులు, మహిళల కోసం నూతన లిఫ్ట్ సౌకర్యం, ఏక్స్ రే మెషిన్, న్యూ బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని హరీశ్ ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ఒక మినీ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా.. రాబోయే 15 రోజుల్లో పనులు ప్రారంభయ్యేలా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

ఆందోళన వద్దు…

ఒమిక్రాన్​గురించి ఆందోళన అవసరం లేదని, వ్యాక్సినేషన్, అప్రమత్తతో దాన్ని జయించవచ్చని మంత్రి అన్నారు. కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుమిగూడే, రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దని కోరారు. హైద‌రాబాద్‌లోనే 1,600 అద‌న‌పు ప‌డ‌క‌లు… మ‌ల్కాజ్‌గిరి, కొండాపూర్‌, మ‌ల‌క్‌పేట్‌, గోల్కొండ‌, గాంధీ ఆస్పత్రిలో మొత్తం 792 ప‌డ‌క‌లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. నీలోఫ‌ర్‌లో మ‌రో 800 ప‌డ‌క‌లు వీటికికి అదనం అని చెప్పారు. 1, 2 దశల అనుభ‌వాలు దృష్టిలో పెట్టుకొని ప‌డ‌క‌లు, ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల కొర‌త లేకుండా ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయనంద్ గుప్తా, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, కార్పొరేటర్ లచ్చిరెడ్డి, బీఎన్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు కటికరెడ్డి, అరవింద్ రెడ్డి, చింతల రవికుమార్ గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ సభ్యుడు అనిల్ కుమార్ చౌదరి, డాక్టర్లు హరిప్రియ, సోమ శేఖర్, మాజీ కార్పొరేటర్లు జిట్ట రాజశేఖర్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న గౌడ్, పార్టీ నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed