పుట్టా మధు ‘ప్రెస్ మీట్’.. ఏం మాట్లాడారంటే.?

by  |
పుట్టా మధు ‘ప్రెస్ మీట్’.. ఏం మాట్లాడారంటే.?
X

దిశ, పెద్దపల్లి : కరోనాపై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, వైరస్‌ను ఎదుర్కొనేందుకు చికిత్స కన్నా ధైర్యమే మందు అని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ రాగానే ఏదో ప్రమాదం జరిగిపోయిందనే భయాందోళనలకు గురవుతున్నారని, పాజిటివ్ వచ్చిన 99 శాతం మందిలో కరోనా నుంచి కోలుకునే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అన్నారు.

కానీ భయానికి గురై, మానసికంగా నిరంతరం ఆలోచించడం వల్లే చాలామంది తీవ్ర అస్వస్థతకు గురై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మందులు, పడకల కొరత ఏమాత్రం లేదని ఆయన వివరించారు. జిల్లా వ్యాప్తంగా 100 ఆక్సిజన్ బెడ్లు, మరో 100 వెంటిలేటర్ బెడ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో మరో 50 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామన్నారు. కరోనాను పూర్తిగా నియంత్రించడంలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించారని వివరించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, కనీస అవసరాలను తీర్చుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. ప్రజలు లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. నిరంతరం సమీక్షిస్తున్నారని వివరించారు. కేసీఆర్ చొరవ వల్లే కరోనా టీకాల్లో జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్-1 గా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలతోపాటుగా పొరుగు రాష్ట్రాల వారికి సైతం ఇక్కడ వైద్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ప్రతిరోజు కరోనా కేసులు వస్తుంటే మరో వైపు అంతకంటే ఎక్కువగా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, వైద్య ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉన్నదని తెలిపారు.

ఇలాంటి ఆపత్కాలంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పల్లె, పట్టణంలోని ప్రతీ గడపలో వుండే ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్య సిబ్బంది ఇంటింటి ఫీవర్ సర్వేలు సైతం నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతానికిపైగా ఈ ఫీవర్ సర్వే పూర్తయిందని అన్నారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా సేవాలందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, పంచాయితీరాజ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మీడియా సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Next Story