ప్రాణంతో వెళ్లి శవంగా వస్తే.. నో ఎంట్రీ

by  |
Covid dead bodies
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఉండాలి.. చచ్చిపోతే దహన సంస్కారాల కోసం వెతుక్కోవడం చాలా దారుణం. ఇలాంటి పరిస్థితులు గ్రామాల్లో ఉండకూడదు..” అని సీఎం కేసీఆర్​ పదేపదే చెప్పే విషయం. కానీ ఇప్పుడు మృతదేహాలను గ్రామంలోకి రానీయడం లేదు. గ్రామాల వెలుపల ఉన్న వైకుంఠధామాలకు కూడా అనుమతించడం లేదు. అటు గ్రామస్థులు, ఇటు పంచాయతీ పాలకవర్గాలు కరోనా మృతులను ఊరవతలే పూడ్చి పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారు.

“ ఇటీవల వరంగల్​ అర్బన్​ జిల్లాలోని ఓ గ్రామంలో కరోనాతో ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఎక్కడో రెండో కొడుకు ఇంటి దగ్గర మరణించిన సదరు వృద్ధురాలి శవాన్ని సొంతూరుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఓ అంబులెన్స్​లో సొంతూరు తీసుకురాగా… సదరు ఊరి జనం వద్దంటూ పొలిమేరలోనే అడ్డుకుంది. దీంతో విధిలేక జేసీబీతో ఊరి బయట బొంద తీసి పూడ్చి పెట్టారు.” ఇలా ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది.

వద్దే వద్దు

సెకండ్​ వేవ్​లో కరోనా చావులు పెరిగాయి. కొవిడ్​ మొదటి దశలో మరణాలు తక్కువే నమోదైనా.. రెండో దశ మాత్రం గ్రామాలకు విస్తరించింది. ఫలితంగా మరణాలు ఎక్కువవుతున్నాయి. దీర్ఘకాల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలతో పాటుగా కరోనా సోకితే ప్రాణం వదులుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాతో చనిపోయినా… ఆఖరుకు ఆస్పత్రిలో చనిపోతే చాలు… శవాన్ని గ్రామంలోకి రావద్దంటూ కరాఖండిగా చెప్పుతున్నారు. ఏవైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి అక్కడ చనిపోతే గ్రామంలోకి తీసుకురానీయడం లేదు. దీనికోసం పంచాయతీ పాలకవర్గాలు గ్రామ శివారుల్లో ఏదో ఓ చోట శవాన్ని పాతి పెట్టిస్తున్నారు. అంతేకాకుండా ఎవరినీ ముట్టుకోనీయకుండా… కనీసం ఖననం చేసేందుకు మట్టి తీయనీయకుండా యంత్రాలతోనే అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది.

ఊర్లో చస్తేనే వైకుంఠధామాలకు..!

గ్రామాల్లో ఉండి, అనారోగ్యమే, వృద్ధ్యాప్యంతో చనిపోతేనే వైకుంఠధామాల్లో అంత్యక్రియలకు అనుమతిస్తున్నారు. ఊరి నుంచి ఆస్పత్రికి వెళ్లి చనిపోతే ఇక గ్రామంలోకి అసలే రానీయడం లేదు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు దాదాపుగా నిర్మాణం చేశారు. కానీ ఇప్పుడు కరోనాతో చనిపోయిన శవాలను అటువైపు తీసుకుపోనీయడం లేదు. అంతేకాదు… చనిపోయిన కుటుంబానికి కూడా ఎలాంటి సాయం అందడం లేదు. సదరు కుటుంబానికే దూరంగా ఉంటున్నారు.

మా ఊరికి రాకండి

మరోవైపు గ్రామాల్లో మళ్లీ సెల్ప్​ లాక్​డౌన్​ మొదలైంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది పట్టణాలను వీడి గ్రామాలకు వెళ్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికే కేసులు నమోదవుతుండటంతో… స్వచ్ఛందంగానే లాక్​డౌన్​ పాటిస్తున్నారు. సాయంత్రమైతే చాలు గ్రామాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని రావద్దంటూ సూచిస్తున్నారు. కొన్నిచోట్ల టెస్ట్​లు చేయించుకుని రిపోర్టులు వచ్చిన తర్వాతే రావాలంటూ చెబుతున్నారు. ఒకవేళ గ్రామంలోకి వచ్చినా… కొన్ని రోజుల పాటు వారిని దూరంగానే ఉంచుతున్నారు.

Next Story

Most Viewed